కవిత కోసం కేసీఆర్ కుట్రలు .. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థితో సైతం బేరం : ఎంపీ అరవింద్ ఫైర్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత కోసం నిజామాబాద్ లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు . కవిత ఎమ్మెల్సీ కావటానికి చెయ్యని పని లేదని చెప్పారు. ప్రజలు వద్దని పంపిస్తే మళ్ళీ దొడ్డిదారిన వస్తుందని ఎద్దేవా చేశారు . డైరెక్ట్ గా పక్కన పడేస్తే ఇన్ డైరెక్ట్ గా మళ్ళీ వస్తుందని , ప్రజలు పూర్తిగా బొంద పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఘాటుగా విమర్శించారు . కే ట్యాక్స్ కట్టలేక ప్రజలు ఓడించారని విమర్శించారు.

బీజేపీ కార్పొరేటర్ లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు
సీఎం కేసీఆర్ తన బిడ్డను గెలిపించుకోవడం కోసం బీజేపీ కార్పొరేటర్లను కొంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. సురేష్ రెడ్డి ,డి శ్రీనివాస్, మండవ వెంకటేశ్వరరావు ఏం జరగలేదని, కార్పొరేటర్లు పోతే ఏమవుతుంది అని ఆయన ప్రశ్నించారు. ఇందూరులో ప్రజలు ప్రధాని మోడీ ముఖం చూసి ఓట్లు వేశారని, కార్పొరేటర్ లను చూసి ఓటు వేయలేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీని విడిచిన కార్పొరేటర్లు చచ్చిన వారితో సమానం అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని సైతం కొనేందుకు యత్నం చేసిన టీఆర్ఎస్
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని సైతం కొనేందుకు టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్ నుంచి ఐదుగురిని కొనుగోలు చేశారని, టిఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ఆధిక్యం ఉన్నప్పటికీ ఇతర పార్టీల వారిని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ కొంటున్నారంటూ ఆయన మండిపడ్డారు .తండ్రీ కూతుళ్లకు మరోమారు ఇందూరు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.
సునాయాసంగా గెలిచే సీటు కోసం లక్షలు పోసి కొంటున్నారని ఆరోపించారు . రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ముఖ్యమంత్రి సొంత ఖజానా నింపుకున్నారని ఆరోపించారు . వేలకోట్లు తిన్న కేసీఆర్ , ఆయన కుమారుడు కేటీఆర్ భవిష్యత్ లో జైలుకు వెళ్ళటం ఖాయం అని పేర్కొన్నారు .

కేంద్రం వ్యవసాయ బిల్లును ఏకపక్షంగా ఆమోదించిందా .. వీఆర్వో ల తొలగింపు చర్చించారా?
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా సమాధానం చెప్పారు. కేంద్రం వ్యవసాయ బిల్లును ఏకపక్షంగా ఆమోదించింది అంటూ పేర్కొన్న టిఆర్ఎస్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ ధర్మపురి అరవింద్.
వ్యవసాయ బిల్లులను ఏకపక్షంగా ఆమోదించారని అంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.. వీఆర్వోల తొలగింపుపై ప్రతిపక్షాలతో చర్చించిందా అంటూ ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. రైతులను తప్పుదోవ పట్టించే విషయాలను చెబుతున్నారని, నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు పెట్టుబడి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టం అమలైతే మోడీ రైతులకు దేవుడే అవుతాడు
ఈ చట్టాలు అమలైతే రైతులకు మోడీ దేవుడవుతాడు అని ఆయన పేర్కొన్నారు . పంట అమ్మకం విషయంలో కూడా ఎక్కడ ధర ఎక్కువగా ఇస్తే అక్కడ రైతు అమ్ముకునే వీలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం నుంచి పన్నులు వసూలు చేసే హక్కు లేదని తెలిపిన ధర్మపురి అరవింద్ కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
రైతులను మభ్యపెట్టే మాటలు చెప్పి అడుగడుగునా మోసం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు .

టీఆర్ఎస్ విమర్శలకు సమాధానం చెప్పిన ఎంపీ అరవింద్
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని టిఆర్ఎస్ పార్టీ సైతం వ్యతిరేకిస్తోంది . పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంలోనూ వ్యతిరేకంగా ఓటు వేసి తమ నిరసన తెలియ చేసింది. అయితే టిఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవసాయ చట్టంపై విమర్శలు చేస్తున్న నేపద్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటి అని నిలదీశారు. వీఆర్వోల తొలగింపుపై ప్రతిపక్షాలతో చర్చ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
రైతులతో పెట్టుకున్నందుకే కవితకు బుద్ధి చెప్పారన్నారు .












Click it and Unblock the Notifications