తెలంగాణలో బీజేపీకి ఊహించని గెలుపు, కేసీఆర్ 'హిందుగాళ్లు-బొందుగాళ్లే' కారణమా?
హైదరాబాద్: తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ! ఉద్యమం సమయంలోనే కాకుండా, ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అధికార పార్టీ నేతలు ఇదే చెబుతున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. 2014లో బొటాబొటి మెజార్టీతో గట్టెక్కిన కేసీఆర్.. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్తో 90 సీట్లకు పెంచుకున్నారు. ఇటీవల గత డిసెంబర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి అద్భుత విజయం సాధించారు. 119 సీట్లకు గాను 88 సీట్లలో గెలుపొందగా, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు చేరడంతో సెంచరీ దాటింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ గెలుపు దక్కించుకున్న కేసీఆర్.. లోకసభ ఎన్నికల్లోను తమకు తిరుగులేదని, 16 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ఓటర్లు ముఖ్యమంత్రికి గట్టి షాకిచ్చారు.

దారుణ పరాభవం... 4 నెలల్లో కేసీఆర్కు అంతా రివర్స్
ట్రెండ్స్ చూస్తే 17 లోకసభ స్థానాలకు గాను హైదరాబాదులో మజ్లిస్ గెలవగా, మిగతా 16 చోట్ల 8 తెరాస, 4 బీజేపీ, 4 కాంగ్రెస్ దక్కించుకుంది. సికింద్రాబాద్, అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లలో కమలం పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. నల్గొండ, భువనగిరి, చేవెళ్ల, మల్కాజిగిరిలలో కాంగ్రెస్ సత్తా చాటింది. 16 స్థానాలు మావే అన్న తెరాస జహీరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి.. అంటే 8 స్థానాలకే పరిమితమైంది. నాలుగు నెలల క్రితం భారీ మెజార్టీతో గెలిచిన కేసీఆర్.... ఇప్పుడు తన కూతురు కవితను, తనకు ఎంతో సన్నిహితుడైన వినోద్ కుమార్ను కూడా గెలిపించుకోలేకపోయారు. 2014లో తెరాస నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బలంగా ఢీకొట్టలేకపోయారు. మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డిని అడ్డుకోలేకపోయారు. లోకసభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేసీఆర్కు దారుణ పరాభవం జరిగి ఉండేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో బీజేపీకి ఊహించని గెలుపు
ఉత్తరాదిన బీజేపీ ప్రభావం తెలిసిందే. దక్షిణాదిన కర్ణాటక మినహా బీజేపీకి ఎక్కడా పట్టు లేదు. దక్షిణాదిన మహా అయితే కేరళలో ఒకటి రెండు సీట్లు గెలుస్తుందని భావించారు. తెలంగాణలో మహా వస్తే ఒకటి అర వస్తాయని భావించారు. కానీ అనూహ్యంగా నాలుగు స్థానాలు బీజేపీ వశం అయ్యాయి. అది కూడా భారీ మెజార్టీతో. తెలంగాణలో కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో గెలిచింది. కానీ బీజేపీ మాత్రం భారీ మెజార్టీ సాధించింది. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి దాదాపు 60వేల మెజార్టీ, కరీంనగర్లో బండి సంజయ్ 90,000 మెజార్టీ, అదిలాబాద్లో సోయం బాపూరావు దాదాపు 60వేల మెజార్టీ, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ దాదాపు 40వేల మెజార్టీతో ఉన్నారు.

సికింద్రాబాద్ సరే.. ఆ మూడు బీజేపీ గెలవడం వెనుక...
2014లో తెలంగాణలో బీజేపీ గెలిచింది ఒకే ఒక సీటు. అది సికింద్రాబాద్. బండారు దత్తాత్రేయను తప్పించి కిషన్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చినా.. ఇక్కడ పట్టు కారణంగా బీజేపీ గెలుపు ఖాయమని అందరూ భావించారు. కరీంనగర్, నిజామాబాద్లలోను బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని భావించారు. కానీ భారీ విజయం దక్కించుకుంది. ఎవరూ ఊహించని అదిలాబాద్ కూడా బీజేపీ ఖాతాలో పడింది. ఈ మూడు సీట్లు కూడా కమలం గెలవడానికి ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులతో పాటు అన్నింటికి కలిపి కూడా ఓ కారణం ఉంది. అదే కేసీఆర్ వ్యాఖ్యలు అనే వాదనలు వినిపిస్తున్నాయి. మార్చి నెలలో కరీంనగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి హిందువులపై తీవ్రవ్యాఖ్యలు చేశారనే విమర్శలు వచ్చాయి. దీనిపై బీజేపీ భగ్గుమన్నది. ప్రధాని మోడీ, స్థానిక బీజేపీ నేత బండి సంజయ్ను తదితర బీజేపీ నేతలను ఉద్దేశించి.. హిందుగాళ్లు, బొందుగాళ్లు అని వ్యాఖ్యానించారు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆ సానుభూతి అప్పటికే ఉంది.

హిందుగాళ్లు మాటే ఆ 3 చోట్ల బీజేపీని గెలిపించిందా?
హిందువులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో చర్చనీయాంశంగా మారాయి. మైనార్టీ ఓట్లను ఆకట్టుకునేందుకు కేసీఆర్ హిందువులను అవమానించారని, ఆయనకు బుద్ది చెప్పాలని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ ప్రభావం కరీంనగర్ చుట్టుపక్కల బెల్ట్లో పడిందని భావిస్తున్నారు. కరీంనగర్ పక్కనే ఉన్న నిజామాబాద్, అదిలాబాద్ పైన పడిందని చెబుతున్నారు. హిందువులను అవమానించిన కేసీఆర్కు బుద్ధి చెప్పాలని ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో, వాట్సాప్లో ప్రచారం సాగితే, ఇప్పుడు... హిందుగాళ్లు-బొందుగాళ్లు అన్న ఒక్క మాటతో కేసీఆర్ను బీజేపీకి 4 సీట్లు ఇచ్చిన కేసీఆర్కు థ్యాంక్స్ అని పేర్కొంటున్నారు. మొత్తంగా ఈ బెల్ట్లో (కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్)లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రభావం బాగానే పడిందని అంటున్నారు. కేసీఆర్ వ్యాఖ్యల ప్రభావం బాగానే పడిందని అప్పుడే గ్రహించిన కేటీఆర్ నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. తన తండ్రిని మించిన హిందువు లేడని నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ వ్యాఖ్యల ప్రభావం బాగా వెళ్లిందని, దీంతో దెబ్బకొట్టారని అంటున్నారు. తాను నాస్తికుడినని చెప్పుకునే కేటీఆర్ కూడా నష్టనివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.

కవితకు ఇతర సమస్యల షాక్
ఇక, స్థానిక సమస్యల విషయానికి వస్తే నిజమాబాద్లో పసుపు బోర్డును తీసుకురాలేకపోవడం, పైగా ఎన్నికలకు ముందు ఆ నెపాన్ని కవిత బీజేపీ పైకి నెట్టడం ప్రజలు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర లేకపోవడం, రెండు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలనే డిమాండ్ నెరవేరలేదు. నిజమాబాద్లో ధర్మపురి అరవింద్కు పట్టు ఉంది.
కరీంనగర్లో బండి సంజయ్కు యువతలో మంచి పట్టు ఉంది. స్థానికంగా మంచి పేరు ఉంది. దానికి తోడు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడంతో సానుభూతి కలిసి వచ్చింది. వినోద్ కుమార్పై అసంతృప్తి కూడా ఉంది. అదిలాబాద్లో సోయంబాపూరావు గెలుపుకు మరిన్ని లెక్కలు ఉన్నాయి. ఆదివాసీలు, గిరిజనుల మధ్య చిచ్చు రాజేయడంతో పాటు అభ్యర్థికి ఉన్న పట్టు కలిసి వచ్చింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications