రాజమండ్రిలో మహానాడు ఏర్పాట్లు మొదలు-28న పొత్తుల్ని తేల్చేస్తారా ?
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో విపక్ష టీడీపీ కీలక రాజకీయ నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం వద్దనున్న వేమగిరిలో పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. ఇవాళ మహానాడు వేదిక నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో అధికారికంగా మహానాడు ఏర్పాట్లు మొదలైనట్లు భావించవచ్చు. ఇప్పటికే ఈ మహానాడు విజయవంతం చేసేందుకు అధినేత చంద్రబాబు 15 కమిటీలు నియమించారు.
మహానాడు -2023 నిర్వహణ ప్రాంగణానికి ఇవాళ ఉదయం 9.25 నిమిషాలకు భూమిపూజ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమం నిర్వహించారు. మహానాడు నిర్వహణలో కీలకమైన ప్రాంగణం నిర్మాణం ఇవాళ ప్రారంభం కాబోతోంది. ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు మహానాడును ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తారు. అప్పటి కల్లా నిర్మాణం పూర్తి చేసుకునేలా ప్లాన్ చేశారు.

ఈసారి టీడీపీ మహానాడు నిర్వహణకు 15 కమిటీల్ని ఏర్పాటు చేశారు. మహానాడు ఆహ్వానాల కమిటీలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు పలువురు సభ్యులుగా ఉన్నారు. తీర్మానాల కమిటీలో యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్.ఏ.షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల్ని నియమించారు. మహానాడుకు సంబంధించిన అన్ని కమిటీల్లో కలిపి మొత్తం 200 మంది సభ్యులున్నారు.
ఈసారి మహానాడు టీడీపీకి అన్ని విధాలా దిశానిర్దేశం చేయబోతోంది. ముఖ్యంగా రాజకీయంగా పొత్తులు కీలకంగా మారుతున్న నేపథ్యంలో జనసేన, బీజేపీతో కలిసి ఎలా ముందుకు సాగాలన్నది మహానాడులోనే నిర్ణయిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నిన్న చేసిన ప్రకటనతో పొత్తులు, సీట్ల పంపకాలు, సీఎం సీటు విషయంలోనూ దాదాపు క్లారిటీ వచ్చేసింది. దీంతో మహానాడులో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని ప్రకటించేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. కలిసొస్తే బీజేపీని కూడా కలుపుకుని, లేదంటే జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications