ఇదేమి విచిత్రం.. అంబులెన్స్కు దారి ఇచ్చే క్రమంలో ప్రమాదం.. ఎక్కడంటే..
అంబులెన్స్ వస్తే దారి ఇవ్వడం కామన్.. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వెహికిల్కు దారి ఇవ్వాల్సిందే. అయితే కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయి. అవును దారి ఇచ్చే సమయంలో వాహనాలు ఢీ కొంటాయి. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అంబులెన్సుకు దారి ఇచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గేటు వద్ద ఘటన జరిగింది.
రహదారిపై కార్లు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి. ఆ సమయంలో ఒక అంబులెన్స్ వచ్చింది. అంబులెన్సుకు దారి ఇచ్చే ఉద్దేశంతో రోడ్డుపై వెళ్తున్న ఒక కారును డ్రైవర్ స్లోగా నడపడంతో వేగం తగ్గింది. ఉన్నట్టుండి ముందు కారు స్లో కావడంతో, వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తం ఏడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
కార్ల ప్రమాదం వల్ల ఈ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్ క్లియర్ చేశారు. అంబులెన్స్కు దారి ఇవ్వడం కంపల్సరీ.. అలా కానీ కార్లు ఢీ కొనేవరకు వెళ్లడం మాత్రం బాగోలేదు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు.