కేసీఆర్ ఫామ్హౌస్లో యువకుడి దుర్మరణం: కుటుంబ సభ్యుల ఆందోళన
సిద్ధిపేట్: సిద్ధిపేట్ జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు చెందిన ఫామ్హౌస్లో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కూలీ పనుల కోసం వచ్చిన ఆ యువకుడు ప్రమాదావశావత్తూ ఫామ్హౌస్లోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఉందీ ఫామ్హౌస్. విశ్రాంతి తీసుకోవడానికి కేసీఆర్ తరచూ ఈ ఫామ్హౌస్కు వస్తుంటారు. అతిపెద్ద ఫామ్హౌస్ కావడం వల్ల రోజువారీ వ్యవసాయ పనుల కోసం చుట్టు పక్కల గ్రామాల నుంచి స్థానికులు వెళ్తుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వ్యవసాయ బావి చుట్టూ ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు విస్తృతంగా పెరిగాయి. రెండు రోజులుగా వ్యవసాయ బావి వద్ద ముళ్ల పొదలను తొలగించే పనులు సాగుతున్నాయి.
ఈ పనులను చేయడానికి వచ్చిన ఆంజనేయులు అనే యువకుడు ప్రమాదశావత్తూ బావిలో పడి మరణించాడు. అతని వయస్సు 19 సంవత్సరాలు. ఎర్రవల్లి సమీపంలోని వరద రాజాపూర్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఫామ్ హౌస్లో బావి వద్ద పిచ్చిమొక్కలను తొలగించే సమయంలో పొరపాటున కాలుజారి బావిలో పడ్డాడని, దీనితో అక్కడికక్కడే మరణించాడని చెబుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
19 సంవత్సరాల వయస్సు కావడం, కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటాడని భావించిన తమ కుమారుడు ఊహించని విధంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ వారు ఫామ్హౌస్ వద్ద ఆందోళన చేపట్టారు. అన్ని విధాలుగా ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటామని ఫామ్హౌస్ అధికారులు స్పష్టం చేశారు. అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.