అమానుషం... కరోనా పేషెంట్ మృతదేహం జేసీబీలో తరలింపు...
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. స్థానికులు కూడా ససేమిరా అనడంతో ఆ మృతదేహానికి అధికారులే అంత్యక్రియలు చేశారు. అయితే అమానుషంగా ఆ మృతదేహాన్ని జేసీబీలో తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.

పలాసలో మున్సిపల్ ఉద్యోగి మృతి...
శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటిలోని ఉదయపురంకు చెందిన ఓ మున్సిపల్ ఉద్యోగి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం(జూన్ 26) ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందాడు. అనంతరం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అప్పటివరకూ ఆ మృతదేహం వద్దే ఉన్న కుటుంబ సభ్యులు,బంధువులు ఎవరి దారి వారు చూసుకున్నారు. అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు.పీపీఈ కిట్లు ఇస్తామని,శానిటైజేషన్ చేస్తామని చెప్పినా వారు వినిపించుకోలేదు.

అమానుషంగా...
స్థానికులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో స్థానిక మున్సిపల్ అధికారులే అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే మృతదేహాన్ని జేసీబీలో శ్మశానానికి తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మృతుడి కుమారుడు మాట్లాడుతూ.. తన తండ్రి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడన్నారు.ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని... అయినప్పటికీ స్థానిక అధికారులే అనవసరంగా హడావిడి చేశారని ఆరోపించారు.
Recommended Video

11,489కి చేరిన కేసులు...
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 10 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 11,489కు చేరుకున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 146 మంది కరోనా సోకి మృతి చెందారు.ఇందులో 570 కేసులు రాష్ట్రానికి చెందినవారివి కాగా, మిగతా 35 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారివిగా నిర్దారించారు. ఇప్పటివరకూ 5,196 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 6,147 యాక్టీవ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,305 శాంపిల్స్ పరీక్షించగా 605 మందికి పాజిటివ్గా తేలింది.












Click it and Unblock the Notifications