T20 World Cup 2021: టీ20 అంటే చాలు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుపై అతను కర్చీఫ్ వేసినట్టే
అబుధాబి: టీ20 ప్రపంచ కప్ అసలు సిసలు పోరాటానికి తెర లేవనుంది. ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచులు నడుస్తున్నాయి. క్రికెట్ ఆడే ఎనిమిది ప్రధాన దేశాల జట్లు పాల్గొనే మ్యాచులు ఇక మొదలు కాబోతోన్నాయి. ఇందులో అందరి ఫోకస్ కూడా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మీదే నిలిచింది. ప్రపంచకప్ టోర్నమెంట్ జైత్రయాత్రను భారత్ క్రికెట్ జట్టు- తన చిరకాల ప్రత్యర్థితో ఆరంభించబోతోంది. టీమిండియా.. తన మొదటి మ్యాచ్లోనే పాకిస్తాన్ను ఢీ కొట్టబోతోంది.
31న రెండో మ్యాచ్..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు వేదిక అయింది. భారత కాలమానం ప్రకారం- ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఇన్నింగ్ మొదలవుతుంది. టీమిండియా తన రెండో మ్యాచ్ ఈ నెల 31వ తేదీన ఆడనుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ను భారత్ ఎదుర్కొంటుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.
బంగ్లా, స్కాట్లాండ్తో
ఇక మూడో మ్యాచ్ నవంబర్ 3న ఉంటుంది. బంగ్లాదేశ్తో తలపడుతుంది. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభమౌతుంది. స్కాట్లాండ్ టీమ్తో తన నాలుగో మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. దీనికోసం మళ్లీ అబుధాబి నుంచి దుబాయ్కు షిఫ్ట్ అవుతుంది. అయిదో మ్యాచ్ ఎవరితో అనేది గ్రూప్ బీ జట్ల మీద ఆధారపడి ఉంటుంది. 2007లో టీ20 ప్రపంచకప్ మొదలైన తరువాత ఛాంపియన్గా నిలిచింది టీమిండియా.
2007 తరువాత ఒక్కసారిగా కూడా..
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు పైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసింది. టైటిల్ను ఎగరేసుకెళ్లింది. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ ఛాంపియన్గా అవతరించలేదు. ఇప్పుడా లోటును తీర్చుకోవాలనే పట్టదలతో ఉంది కోహ్లీసేన. దానికి తగ్గట్టుగా తొలి మ్యాచ్ పాకిస్తాన్తోనే కావడంతో ఆ జట్టుపై విజయం సాధించితే.. దాని పాజిటివ్ వైబ్రేషన్స్ టోర్నమెంట్ మొత్తం ఉంటాయని అంచనా వేస్తోంది. అందుకే పాకిస్తాన్ను మరోసారి చిత్తు చేయడానికి సమాయత్తమౌతోంది.
2014లో అవకాశం వచ్చినా..
ఇప్పటిదాకా ఆరుసార్లు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్స్ ఏర్పాటు కాగా.. భారత్ ఒక్కసారి మాత్రమే టైటిల్ విన్నర్గా నిలిచింది. 2014 నాటి టోర్నమెంట్లో ఫైనల్ వరకూ వెళ్లగలిగినప్పటికీ.. దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది. ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది భారత జట్టు. రన్నరప్గా నిలిచింది. చివరిసారిగా 2016లో జరిగిన ఈ టీ20 టోర్నమెంట్లో సెమీ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్లగిలిగింది. సెమీస్లో వెస్టిండీస్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. ఆ తరువాత మళ్లీ టీ20 ప్రపంచకప్లో ఆడబోతోండటం ఇప్పుడే.
అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు..
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లలో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న వారు ముగ్గురు టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. వారిలో విరాట్ కోహ్లీ ఎక్కువసార్లు ఈ అవార్డును అందుకున్నాడు. మొత్తంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిదుసార్లు అతని ఖాతాలో జమ అయింది. లెఫ్ట్ హ్యాండెడ్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడుసార్లు చొప్పున ఈ అవార్డ్ కోసం ఎంపిక అయ్యారు.
కర్చీఫ్ వేసినట్టే..
యువరాజ్ సింగ్ అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక మిగిలిన ఇద్దరూ ఇంకా క్రికెట్లో కొనసాగుతున్నారు. ఈ టీ20 టోర్నమెంట్లో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో- తమ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉంది. సాధారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సారథ్యంలో జరిగే ఇలాంటి మెగా టోర్నమెంట్స్ అంటే.. విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడుతుంటాడు. అందుకే అతను అయిదుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ దూకుడు కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.