బిగ్ రిలీఫ్: తెలంగాణకు చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు... రాష్ట్రానికి 200 మెట్రిక్ టన్నుల ప్రాణ వాయువు...
ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు రోడ్డు మార్గం ద్వారా సోమవారం(ఏప్రిల్ 26) తెలంగాణకు చేరుకున్నాయి. రూర్కెలా, అనుగుల్లలోని ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను తీసుకొచ్చాయి. మొదట 6 ఆక్సిజన్ ట్యాంకర్లు,ఆ తర్వాత 4 ట్యాంకర్లు వస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి,గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రి,పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వినియోగానికి ఈ ఆక్సిజన్ను తరలించనున్నారు.
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు...
కరీంనగర్,ఖమ్మం జిల్లాలకు ఒక్కో ఆక్సిజన్ ట్యాంకర్ చొప్పున పంపించనున్నారు. ట్యాంకర్ వాహనాలను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చేందుకు సుశిక్షితులైన ఆర్టీసీ డ్రైవర్లను నియమించారు. రాష్ట్రానికి చేరిన ఆక్సిజన్ను అన్ని ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేసింది. మొదట ఆ ట్యాంకర్లను ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులకు తరలించి అక్కడి ఆక్సిజన్ ప్లాంట్లో నింపనున్నారు. అనంతరం జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తారు.
10 రోజులకు సరిపడ ఆక్సిజన్...
అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు చేరగా మిగిలిన ఆక్సిజన్ను అవసరమున్న చోటకు పంపిస్తారు. ప్రస్తుతం అందిన 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రంలో వారం నుంచి 10 రోజుల మెడికల్ అవసరాలకు సరిపోతుందని అధికారులు వెల్లడించారు. తదుపరి ఒడిశా లేదా చెన్నై,బళ్లారిలకు హైదరాబాద్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత శుక్రవారం హైదరాబాద్ నుంచి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశా తరలించిన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో రాష్ట్రానికి త్వరగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సప్లై కోసం యుద్ధ విమానాలను ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది.
Recommended Video
రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయింపు...
రాష్ట్రంలో కరోనా ఉధృతి ఉగ్రరూపం దాలుస్తుండటంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతున్న పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం యుద్ధ విమానాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 384 టన్నుల మేర ఆక్సిజన్ డిమాండ్ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు కేంద్రం రాష్ట్రానికి 360 మెట్రిక్టన్నుల ఆక్సిజన్ను కేటాయించింది. అందులో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్న చిన్నచిన్న పరిశ్రమల నుంచి రానుండగా... మిగిలిన ఆక్సిజన్ను బళ్లారి, భిలాయ్, అనుగుల్ (ఒడిశా), పెరంబుదూర్ (తమిళనాడు) నుంచి కేటాయించింది. అయితే తెలంగాణకు సమీపంలోని బళ్లారి నుంచి కాకుండా 1300 కి.మీ దూరంలోని ఒడిశా నుంచి ఆక్సిజన్ కేటాయింపులు జరపడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒడిశా నుంచి రోడ్డు మార్గంలో రవాణాకు 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉండటంతో యుద్ధ విమానాల ద్వారా ట్యాంకర్లను తరలించింది.