హాల్ టికెట్ ఇవ్వలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: మొయినాబాద్లోని తాను చదువుతున్న కళాశాల సమీపంలో ఇంజనీరింగ్ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మాహుతికి ప్రయత్నించి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ విద్యార్థిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
తీవ్ర గాయాల పాలైన ఆ విద్యార్థి చివరికి ప్రాణం కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్కు చెందిన కె శివమహేష్ (21) చత్తీస్గఢ్లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. స్థానిక విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో చేరేందుకు వెళ్లగా సర్ట్ఫికెట్లను పరిశీలించిన కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థి చదివిన ఇంటర్ కళాశాలకు గుర్తింపు లేదని చెప్పింది.
దీంతో అతను అభినవ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ కోర్సులో చేరాడు. వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించినప్పటికీ. హాల్ టికెట్ ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ అధికారులు అనుమతించలేదని అని కళాశాల యాజమాన్యం చివరి నిమిషంలో స్పష్టం చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివమహేష్ కళాశాల సమీపంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు శివను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతనికి తొంభై శాతం కాలిన గాయాలైన శివమహేష్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.