నయీం కేసులో కీలక ఆధారాలు: అమ్మాయిలతో జల్సాలు చేస్తూ..
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం మృతి అనంతరం అతని గురించి ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. మావోయిస్టుల సమాచారం ఇస్తానంటూ ఛత్తీస్గఢ్ పోలీసులకు దగ్గరైన నయీం అక్కడ పెద్ద సామ్రాజ్యాన్నే విస్తరించాడు.
రాయపూర్, సుకుమా, జగదల్పూర్లలో పెద్ద ముఠాలను ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహించాడు. ఛత్తీస్గఢ్ లింకుల గురించి ఆరా తీసేందుకు నయీం కేసు దర్యాప్తుపై ఏర్పాటైన సిట్ ఆధ్వర్యంలో బృందం శనివారం అక్కడికి వెళ్లింది.
కస్టడీలో ఉన్న నయీం అనుచరులు ఫర్హానా, అఫ్సానా, ఫయీం అతని భార్య షాహినను సిట్ విచారిస్తోంది. ఈ విచారణలో ఛత్తీస్గఢ్లో నయీం డెన్ ఉన్నట్లుగా సమాచారం రాబట్టింది. దాన్ని కనుగొనేందుకు సిట్ శనివారం చత్తీస్గఢ్ వెళ్లింది. స్థానిక పోలీసుల సహకారంతో నయీం డెనలో సోదాలు నిర్వహించనుంది.
ఈ డెన్ నుంచి నయీం భారీ స్థాయిలో సెటిల్మెంట్లు చేసినట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులోనే గుర్తించింది. రాయ్పూర్ ప్రాంతానికి నయీం తన గ్యాంగ్ సభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో వెళ్లేవాడని ఆధారాలు లభించాయి. ఆడపిల్లల అక్రమ రవాణా కోణంలోనూ సిట్ వివరాలు సేకరిస్తోంది.
మహబూబ్నగర్ జిల్లాలోని ఓ తండాకు చెందిన దత్తు అనే వ్యక్తి పది రోజుల పసికందును విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఆర్థిక అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి కొంత మొత్తం చెల్లించి పిల్లల్ని నయీంకు అప్పగించడంలో మిర్యాలగూడలో ఉన్న ఆయన అత్త, బావమరిది, అతని భార్య కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
పిల్లల విక్రయాల్లో కొంతమంది డాక్టర్ల సహకారం కూడా ఉందని తేలడంతో అధికారులు వారిని గుర్తించే పనిలో పడ్డారు. పెద్దవూర మండలం ఏనెమీది తండా వాసి దత్తు అనే గిరిజనుడి నుంచి రెండున్నర నెలల కుమార్తెను ఇద్దరు డాక్టర్ల సహకారంతో నయీం అత్త రూ.50 వేలకు కొనుగోలు చేసినట్లు గుర్తించింది.
ముగ్గురి అరెస్ట్
నయీంకు పదిరోజుల పసిపాపను విక్రయించిన కేసులో శనివారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రెండున్నర నెలల క్రితం పెద్దవూర మండలం ఏనేమీదితండాకు చెందిన దత్తు తన 10 రోజుల కుమార్తెను ఇద్దరు మధ్యవర్తుల ద్వారా నయీం అత్త సుల్తానాకు రూ.50 వేలకు అమ్మాడు.
దీనికి మధ్యవర్తులుగా ఏనేమీదితండాకు చెందిన డాక్టర్ రమేష్, త్రిపురారం మండలానికి చెందిన మరో డాక్టర్ షఫీ వ్యవహరించారు.
అమ్మాయిలతో జల్సాలు చేస్తూ డీల్స్
వీకెండ్లు ఎంజాయ్ చేస్తూ సెటిల్మెంట్లు కూడా పూర్తి చేసేందుకు నయీం గోవాలో ఏర్పాట్లు చేసుకున్నట్లు తేలింది. పర్యాటక ప్రాంతమైన గోవాలో నయీంకు కోకోనట్, చర్చిగేట్ గెస్ట్ హౌ్సలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. వీకెండ్లో అమ్మాయిలతో జల్సా చేయడంతో పాటు పెద్ద మొత్తంలో డీల్స్ను ఇక్కడి నుంచే జరిపినట్లు ఆధారాలు లభించాయని తెలుస్తోంది.
గోవా తరహాలోనే చత్తీస్గఢ్లోను నయీం వీకెండ్ వ్యవహారాలకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నల్గొండ కేంద్రంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ల్లో నయీం కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఏపీలోని విశాఖపట్నం, మరో రెండు ప్రాంతాల్లోనూ నయీం గ్యాంగ్ జాడల్ని పోలీసులు గుర్తించారు.
సిట్ సభ్యుడు సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ చైతన్యపురి కాలనీకి చెందిన నయీం చిన్నమ్మ కూతురు అస్మత్ తజుమల్ అరాను కస్టడీలోకి తీసుకుని విచారించారు.
నయీం ఎన్కౌంటర్ తర్వాత తనిఖీల్లో ఆమె ఇంట్లో పట్టుబడ్డ 36 భూదస్త్రాలు, తపంచా, తల్వార్, కంప్యూటర్ తదితరాల గురించి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది గణేష్ ఉత్సవాల్లో 80 మంది వరకు మీడియా సిబ్బందికి నగదు అందినట్లుగా సమాచారం ఉందని, దానిపై కూడా విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.
కాగా, మిర్యాలగూడలోని ఎస్బీహెచ్ బ్యాంకు లాకర్లో నయీం అత్త పేరున ఉన్న రూ.1.50 లక్షల నగదు, 28 తులాల బంగారం, 70 తులాల వెండిని సిట్ స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా, నయీం బాధితుల ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సిట్ కంట్రోల్ రూంలోని ఫోన్కు సుమారు 250 ఫిర్యాదులు అందినట్లుగా సమాచారం.