తెలంగాణలో కొత్తగా 3614 కరోనా కేసులు, 93 శాతానికి రికవరీ రేటు: జులైలో ఇంటర్ పరీక్షలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 90,226 నమూనాలను పరీక్షించగా కొత్తగా 3614 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,67,517కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా బారినపడి 18 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3207కి చేరింది.

తెలంగాణలో 40వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో 3961 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,26,043కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,267 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు(డీహెచ్) శ్రీనివాసరావు వెల్లడించారు.

93 శాతానికి రికవరీ రేటు.. భారీగా తగ్గిన పాజిటివీ రేటు
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4 శాతంగా ఉన్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 93 శాతానికి పెరిగిందని తెలిపారు. మరణాల రేటు 0.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వేలో 17వేలకుపైగా బృందాలు పాల్గొన్నాయని ఆయన తెలిపారు. ఆరోగ్య బృందాలు ఇప్పటి వరకు 6 లక్షల ఇళ్లల్లో ఫీవర్ సర్వే చేసినట్లు పేర్కొన్నారు. కరోనా ఓపీలో 11,814 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని, ఇప్పటి వరకు 64 ప్రైవేటు ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించి షోకాజు నోటీసులు పంపినట్లు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు 24 గంటల నుంచి 48 గంటల సమయం ఇచ్చినట్లు చెప్పారు. ఎవరైనా ఆస్పత్రులపై ఫిర్యాదు చేయాలనుకుంటే.. 91541 70960 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
Recommended Video

జులైలో తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షలు!
మరోవైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తన అభిప్రాయాలను తెలిపింది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జులై మధ్య నిర్వహించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శికి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి లేఖ రాశారు. పరీక్ష సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరకు తగ్గించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్ష విధానాన్ని మార్చలేమని తెలిపింది. అయితే, ప్రశ్నాపత్రంలోని సగం ప్రశ్నలకే సమాధానాలు రాసేందుకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కరోనా కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మరోసారి నిర్వహిస్తామని, ఫలితాలను ఆగస్టులో వెల్లడిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications