తెలంగాణలో భారీగా పెరుగుతున్న కొత్త కరోనా కేసులు: 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 64,898 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 394 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో శనివారం కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరనాతో మృతి చెందినవారి సంఖ్య 1669కి చేరింది. ఇక కరోనా బారి నుంచి శనివారం 194 మంది కోలుకున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2804 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 1123 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 96,13,583 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో కరోనా బారినపడినవారి సంఖ్య వందకు దాటడం ఆందోళనకరంగా మారింది. తాజాగా, నిర్మల్ జిల్లా ముథోల్ బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో కరోనా కేసుల సంఖ్య 27కి చేరింది. పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బంది కలిపి మొత్తం 121 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 17 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణైంది. శనివారం నిర్వహించిన పరీక్షలో ఇదే పాఠశాలలో మరో 9 మంది విద్యార్థినులు కరోనా బారినపడ్డారు.