తెలంగాణ-ఒరిస్సా పోలీసుల ఆపరేషన్: 4గురు సిమి ఉగ్రవాదులు అరెస్టు
భువనేశ్వర్/హైదరాబాద్: ఒడిశా రాష్ట్రంలోని రార్కేలా కురేచిలో తలదాచుకున్న నలుగురు సిమి(స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిపై అర్థరాత్రి నల్గొండ పోలీసులు.. ఒడిశా పోలీసుల సహకారంతో దాడి చేశారు.
సుమారు 3గంటల పాటు ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఎట్టకేలకు నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 పిస్తోళ్లు, బుల్లెట్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారు 2013లో మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న సిమి ఉగ్రవాదులుగా గుర్తించారు. ఖాండ్వా జైలు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు తప్పించోకోగా, నిరుడు ఏప్రిల్లో నల్గొండ జిల్లాలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ఎజాద్, అస్లామ్ హతమయ్యారు.
మిగిలిన నలుగురు ఉగ్రవాదులు అబూ ఫైజల్, మహబూబ్, అంజాద్, జకీర్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఒడిశా డీజీపీ కేబీసింగ్ ప్రకటించారు. కాగా, నలుగురు ఉగ్రవాదులు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఈ నలుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ ప్రశ్నించే అవకాశం ఉంది.
రూర్కేలాలోని ఖురేషి ప్రాంతంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్న ఈ నలుగురు ఉగ్రవాదులు మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను విస్తృతం చేసుకునేందుకు ప్రణాళిక వేస్తున్నారని తెలిపారు. ఉగ్ర కార్యకలాపాల కోసం పలువురి వద్ద బలవంతంగా వీరు డబ్బును సేకరిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. కాగా, ఉగ్రవాదులను అరెస్ట్ చేేసిన తెలంగాణ, ఒరిస్సా పోలీసులను హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.