తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 5వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 27,488 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 592 మంది కరోనా బారినపడినట్లు తేలింది. మరో 477 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం విడుదల చేసింది.
కొత్తగా నమోదైన కేసులతో తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4997కు చేరింది. రికవరీ రేటు 98.87శాతంగా ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. తాజాగా వచ్చిన కరోనా వైరస్ కేసులలో హైదరాబాద్లో 331, రంగారెడ్డి 60, ఖమ్మం 17, మేడ్చల్ మల్కాజ్గిరి 45, హనుమకొండ 10, భువనగిరి 9, కరీంనగర్ 9, నల్గొండ జిల్లాలో 11 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలోనూ పెరుగుతున్న కరోనా కేసులు
మరోవైపు, దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 18,930 మంది వైరస్ బారినపడగా.. మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య బుధవారంతో పోలిస్తే 2,500కు పైగా కేసులు పెరిగాయి. కొవిడ్ నుంచి 14,650 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతానికి పెరిగింది.
ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాలు 5,25,305కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,19,457కు పెరిగాయి. కోలుకున్నవారి సంఖ్య 4,29,21,977కు పెరిగింది. వ్యాక్సినేషన్ విషయానికొస్తే.. దేశంలో బుధవారం 11,44,489 మందికి టీకాలు వేయగా, ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,33,18,772కు చేరింది.