నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన పోరుగడ్డ పరకాల... నాటి నెత్తుటి చరిత్రకు 72 ఏళ్ళు
తెలంగాణాలో నిజాం నిరంకుశ పరిపాలనకు నిదర్శనంగా పరకాలలో నాడు జరిగిన దారుణ మారణ కాండ నిలుస్తుంది. భూమి కోసం, భుక్తి కోసం, బానిస బ్రతుకుల నుండి విముక్తి కోసం నిజాం రాజుల పై పోరాటం సాగించి రజాకార్ల దాడుల్లో అమరులైన వీరుల రక్త చరిత్రకు నేటికి సరిగ్గా 72 ఏళ్లు. జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించేలా, పరకాల లో జరిగిన మారణ హోమం, పోరుగడ్డ మీద పరకాల వీరులు చిందించిన నెత్తుటి జ్ఞాపకమే పరకాలలోని అమరధామం. తెలంగాణ సాయుధ పోరాటంలో నాటి నెత్తుటి చరిత్రపై వన్ఇండియా అందించే ప్రత్యేక కథనం.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరు
ప్రపంచమంతా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతోన్న సమయమది. బానిస బతుకులతో తెలంగాణ ప్రజల రక్తం ఉడికిపోయింది. తెలంగాణ గ్రామాలలో రజాకార్ల దాష్టీకాలకు అంతులేకుండా పోయింది . మహిళల మాన,ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దీంతో తెలంగాణ సాయుధ పోరాటం రజాకార్లకు వ్యతిరేకంగా తెర మీదకు వచ్చింది. ఉద్యమ నేతల పిలుపు మేరకు సెప్టెంబర్ 2వ తేదీన పరకాల తహసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించుకున్న ఉద్యమ నేతలు, ప్రతి గ్రామం నుండి ప్రజలకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు . పోలీసులు వరంగల్ జిల్లాలో అన్ని సమావేశాలను నిషేధించారు, కాని సమీప గ్రామాల నుండి 1,500 మందికి పైగా ప్రజలు భారత జెండాను ఎగురవేయడానికి వచ్చారు.

జలియన్ వాలాబాగ్ తరహాలో మారణ కాండ సాగించిన రజాకార్లు
పరకాల సమీపంలోని గ్రామాలనుండి భారీ సంఖ్యలో ప్రజలు పరకాల లోని చాపలబండ వద్దకు చేరుకునే సరికి, అక్కడికి వచ్చిన రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కత్తులు , బరిసెలతో ఉద్యమకారులను వెంబడించి ప్రాణాలు తీశారు. నాడు జరిగిన దారుణ మారణ కాండ జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని తలపించేలా జరిగిందని నాటి దృశ్యాలను చూసిన చాలా మంది పెద్దలు ఆనాటి దృశ్యాలను చెప్తుంటే కళ్ళు చెమరుస్తాయి .

చెట్టుకు కట్టేసి ఊచకోత .. నెలకొరిగిన ఉద్యమకారులు
నాటి మారణకాండలో రజాకార్ల కాల్పుల్లో అక్కడికక్కడే 22 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో 150 మంది గాయాల పాలయ్యారు. కొందరు ఉద్యమకారులను చెట్టుకు కట్టి మరీ ఊచకోత కోశారు . మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఇళ్ళను తగలబెట్టారు. అత్యంత పాశవికంగా రజాకార్లు చేసిన ఈ దురాగతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన ఉద్యమకారులు వడ్డేపల్లి వీరయ్య, ఆకుతోట మల్లయ్య, రాజ్ మహమ్మదు లను రంగాపురం లో చెట్టుకు కట్టేసి ఊచకోత కోసి కాల్చి చంపిన ఘటన నేటికీ చాలామంది మర్చిపోలేదు.

నిజాం పాలనకు చరమగీతం పలకటానికి నాందిగా .. అమరధామం నాటి నెత్తుటి చరిత్రకు సాక్ష్యంగా
72 సంవత్సరాల క్రితం నిజాం నిరంకుశ పాలనపై ఇదే రోజున ఉద్యమకారులు సాగించిన పోరు నిజాంల పాలనకు చరమగీతం పాడడానికి నాందిగా మారింది. ఆ వీరుల చరిత్ర, భావితరాలకు తెలిసేలా అమరధామం నిర్మించి ప్రతి సంవత్సరం పరకాల అమరధామం వద్ద స్థానిక ప్రజలంతా అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. నాడు నిజాం రాజులకు ఎదురొడ్డి నెత్తురు చిందించిన అమరవీరులను స్మరించుకుంటారు. వారి త్యాగాలను భావితరాలకు అందించటానికే అమరధామం ఉందని చెప్తారు .












Click it and Unblock the Notifications