రాత్రి ఫోన్ కాల్… నిర్మానుష్య ప్రదేశం… చివరికి శవం..! బోరబండ మర్డర్ మిస్టరీ
నగరం నిద్రలోకి జారుకుంటున్న వేళ... ఒక ఫోన్ కాల్, ఒక నమ్మకం, ఒక అపోహ... చివరికి ప్రాణం తీసిన నేరంగా మారింది. హైదరాబాద్ బోరబండ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో వెలుగులోకి వచ్చిన ఈ హత్య కేసు పోలీసులనే కాదు, స్థానికులను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమా? అనుమానమా? లేక మానసిక వికృతమా? అనే ప్రశ్నల మధ్య ఈ దారుణం చోటుచేసుకుంది.
పబ్లో కలిసి పనిచేసే రోజుల్లో ఖనీజ్ ఫాతిమా, జకీర్ మధ్య పరిచయం ఏర్పడింది. మాటలు పెరిగాయి, నమ్మకం ఏర్పడింది. అయితే కాలం మారింది. ఫాతిమా మరో పబ్లో ఉద్యోగం చేపట్టింది. అదే సమయంలో ఆమె మరో యువకుడితో చనువుగా ఉండటం జకీర్కు నచ్చలేదు. ఆ అనుమానమే అతడిలోని చీకటి కోణాన్ని బయటకు తెచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఆదివారం రాత్రి... "మాట్లాడాలి" అనే ఒక సాధారణ మాటతో ఫాతిమాను జకీర్ బయటకు పిలిచాడు. ఆమె ఏమనుకుంది? నిజంగా మాట్లాడతానని వెళ్లిందా? లేక ఏదో అనుమానం ఉన్నా వెళ్లిందా? అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇద్దరూ ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే కథ మలుపు తిరిగింది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... మొదట ఫాతిమాపై దాడికి యత్నించాడు జకీర్. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ కోపం, పగ, అనుమానం కలిసి అతడిని ఉన్మాదిగా మార్చాయి. చివరికి పక్కనే ఉన్న బండరాయితో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జనసంచారం లేని ప్రాంతం కావడంతో ఎవరికీ విషయం వెంటనే తెలియలేదు.
హత్య తర్వాత అతడే పక్కనే ఉన్న బస్తీకి వెళ్లి విషయం చెప్పినట్టు సమాచారం. ఆ మాటలు విన్న బస్తీ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న బోరబండ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు ఖనీజ్ ఫాతిమాగా గుర్తించారు. నిందితుడు జకీర్ స్థానికంగా జ్యూస్ సెంటర్లో పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.
ఇప్పుడు ఈ కేసులో ప్రశ్నలే ఎక్కువ. హత్యకు జకీర్ ఒక్కడే పాల్పడ్డాడా? మరెవరైనా సహకరించారా? ఫాతిమాను మాట్లాడుదామని పిలిచాడా... లేక ముందే హత్యకు ప్లాన్ చేశాడా? జన సంచారం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రదేశానికి ఆమె ఎందుకు వెళ్లింది? ఈ అన్ని సందేహాలకు సమాధానాలు నిందితుడి విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.
ప్రేమ పేరుతో మొదలైన పరిచయం... అనుమానంగా మారి... చివరికి ప్రాణాలు తీసిన నేరంగా ముగియడం నగరంలో మరోసారి మహిళల భద్రతపై చర్చను తెరపైకి తెచ్చింది. పోలీసుల విచారణలో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications