విషాదం: ఫొటోలు తీసుకుంటూ నదిలో పడిపోయిన జంట
కృష్ణానదిలో ప్రమాదవశాత్తు మునిగిన ఓ దంపతులు ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన జిల్లాలోని అమ్రాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది.
నాగర్కర్నూల్: ఆ దంపతులకు రెండేళ్ల క్రితమే వివాహమైంది. అనుకున్న ఉద్యోగం కూడా రావడంతో వారి దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా సాగుతోంది. ఎన్నో కలలు, ఆశలు కంటూ జీవితాన్ని సరదాగా గడిపేస్తున్నారు. ఇంతలోనే ప్రమాదం ఆ దంపతులను కబలించేసింది. కృష్ణానదిలో ప్రమాదవశాత్తు మునిగిన ఆ దంపతులు జంటగానే ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన జిల్లాలోని అమ్రాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన క్రాంతి కుమార్(30)కు..హైదరాబాద్లోని బాలానగర్ ప్రాంతానికి చెందిన సంయుక్త(25)తో రెండేళ్ల కిందట వివాహమైంది. ఏడాది కిందట తెలంగాణ జెన్కోలో క్రాంతికుమార్కు సహాయ ఇంజినీరుగా(ఎలక్ట్రికల్) ఉద్యోగం వచ్చింది. దీంతో ఈగలపెంటలోని జెన్కో కాలనీలలో క్వాటర్స్లలో నివాసం ఉంటున్నారు.

కాగా, ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో భార్యతో కలిసి సరదాగా ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. డ్యాం వెనుక ప్రాంతంలోని కృష్ణా నదీ తీరానాకి వెళ్లి తిరిగివస్తామని తమ ఇంటి పక్కలో ఉన్న రేడ్యా, శ్రీలత దం పతులకు చెప్పారు. అయితే డ్యాం సమీపంలోని మ త్య్సకారుల గుడిసెలకు వెళ్లే దారిలో భూగర్భ జల వి ద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఇన్టేక్ వద్ద మెట్ల మార్గం నుంచి కృష్ణానది నీటిలో దిగారు. అక్కడే భార్యాభర్తలు కలిసి తమ సెల్ఫోన్లో నీటి వద్ద ఫొటోలు దింపుకుంటున్నారు.
కాగా, భార్య సంయుక్తను భర్త క్రాంతికుమార్ ఫొటో తీస్తుండగా ఆమె ప్రమాదవశాత్తు నీటిలోకి పడిపోయింది. వెంటనే భర్త ఆమెను కాపాడేందుకు తన చేతిలో ఉన్న ఫోన్ను ఒడ్డున వదిలేసి నీటిలోకి దిగాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో పాటు కాపాడేందుకు అక్కడి ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో ఇద్దరు దంపతులు నీటిలో మునిగి మృతి చెందారు. సాయంత్రం బయటకు వెళ్లిన దంపతులు సోమవారం ఉదయం వరకు తిరిగి ఇంటికి రాలేదు.
చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు నీటిలో తేలియాడుతున్న మృత దేహాలను చూసి సమీపంలో ఉన్న ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. అమ్రాబాద్ ఎస్ఐ జాంగీర్, ఈగల పెంట పోలీసులు మధ్యాహ్న ప్రాంతంలో సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. దీంతో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది.
కాగా, పోస్టుమార్టం నిమిత్తం దంపతులన మృతదేహాలను అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దంపతులు మృతి చెందినట్లు తెలియడంతో క్రాంతికుమార్ తల్లిదండ్రులు స్పృహతప్పి పడిపోయారు. దీంతో వారిని కూడా ఆస్పత్రిలో చేర్పించినట్లు బంధువులు తెలిపారు. కాగా, క్రాంతికుమార్ దంపతుల మృతితో విద్యుదుత్పత్తి కేంద్ర ఉద్యోగుల్లో విషాదం అలముకుంది.












Click it and Unblock the Notifications