సారీ నాన్న.. ఉంగరం పోయిందని ఉసురు తీసుకున్న డిగ్రీ విద్యార్థిని
ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు యువత. ఉంగరం పోయిందన్న చిన్న కారణంతో నాన్న క్షమించు అంటూ లేఖ రాసి ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
బంగారపు ఉంగరం పోయిందని ఓ డిగ్రీ విద్యార్థిని ఇల్లంతా వెతికి, చివరకు ఎక్కడా దొరకపోయేసరికి ఈ విషయం తెలిస్తే నాన్న కోప్పడతాడు అన్న భయంతో నాన్న మన్నించు అంటూ లేఖ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది .దంతాల పల్లి మండలం గున్నేపల్లి గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హేమలత రెడ్డి హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం రెండవ సంవత్సరం చదువుతుంది. చిన్న కుమార్తె అశ్విత మరిపెడ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది.

ఈనెల 20వ తేదీన ఉగాది పండుగకు హేమలత రెడ్డి ఇంటికొచ్చింది. 22వ తేదీ బుధవారం తన చేతికున్న పావుతులం ఉంగరం ఎక్కడో జారీ పడిపోయింది. అప్పటినుండి ఇంట్లో బంగారపు ఉంగరం కోసం వెతుకుతూనే ఉంది. అయితే గతంలో కూడా హేమలత రెడ్డి బంగారపు గొలుసును పోగొట్టుకుంది. ఈ క్రమంలో ఈ విషయం తండ్రికి తెలిస్తే కోప్పడతాడని భయంతో మనస్థాపానికి గురైన హేమలత రెడ్డి ఇంట్లో తల్లిదండ్రులు పొలానికి వెళ్ళిన సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సారీ డాడీ నన్ను క్షమించు అంటూ లెటర్ రాసిపెట్టి మరీ ప్రాణం తీసుకుంది. తీరా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపు ఎంతకు తెరువకపోయేసరికి అనుమానం వచ్చి తలుపు బద్దలు కొట్టి లోపల చూడగా కుమార్తె ఉరివేసుకుని కనిపించింది. ఆమెను కిందికి దించి కాపాడాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేసినా అప్పటికే హేమలత రెడ్డి విగత జీవిగా మారిపోయింది. ఇక ఈ ఘటన నేపథ్యంలో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఉంగరం కోసం ప్రాణాలు తీసుకున్న యువతి చేసిన పనికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.












Click it and Unblock the Notifications