భార్యపై అనుమానం: కాలువలో ముంచి, తొక్కిపెట్టి ఇద్దరు పిల్లలను చంపాడు
నిజామాబాద్: జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త రాక్షసుడిలా మారిపోయాడు. తన ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా చంపేశాడు. మరో చిన్నారిని స్థానికులు అతని బారినుంచి కాపాడారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన గౌరాడి చంద్రశేఖర్కు ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుబీర్ గ్రామానికి చెందిన ప్రమీలతో 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు సాత్విక్ (10), మోక్ష (5) పోమేష్ (13 నెలలు) ఉన్నారు. వారి చదువు నిమిత్తం ఐదు నెలలగా వీరు నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉంటున్నారు.
చంద్రశేఖర్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. కాగా, తాగుడుకు బానిసైన చంద్రశేఖర్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పిల్లలు తనకు పుట్టలేదని తరుచూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం భార్యతో గొడవ పడి ఇంటినుంచి వెళ్లగొట్టాడు. పిల్లలను చంపాలని నిర్ణయించుకున్న చంద్రశేఖర్.. సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం సమీపంలో గల డి-40 నిజాంసాగర్ కాలువకు వారిని తీసుకువచ్చాడు.
ముగ్గురు పిల్లలను స్నానం చేద్దామని నమ్మించి వారి బట్టలను విప్పి కాలువలోకి తీసుకెళ్లాడు. ముందుగా పెద్ద పిల్లలు సాత్విక్, మోక్షలను నీటి బురదలో ముంచి.. కాలుతో తొక్కి అత్యంత పాశవికంగా చంపేశాడు. పెట్రోలింగ్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు పిల్లల అరుపులు విని.. అటువైపు వెళ్లి చూడగా చంద్రశేఖర్ ఇద్దరు పిల్లలను నీటిలో ఉంచి తొక్కడాన్ని గమనించారు. కానిస్టేబుళ్లు అరుస్తుండగానే చిన్న కొడుకు పోమేష్ను నీటిలో వేసి తొక్కాడు.
స్థానిక యువకులను అప్రమత్తం చేసిన కానిస్టేబుళ్లు ఆ పిల్లలను రక్షించే ప్రయత్నం చేశారు. కాగా, పిల్లలను నీటిలోంచి తీయగా సాత్విక్, మోక్ష అప్పటికే ప్రాణాలు విడిచారు. కొన ఊపిరితో ఉన్న పోమేష్ను స్థానిక యువకులు ప్రశాంత్, గణేష్, గోపి నీటి నుంచి కాలువ ఒడ్డుకు తీసుకొచ్చి హుటాహుటిన జానకంపేట ఆస్పత్రికి బైకుపై తీసుకెళ్లి చికిత్స అందించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.