అడ్వకేట్ వామన్రావు దంపతుల హత్య కేసులో మాజీ మంత్రి పాత్ర... తెర పైకి సంచలన ఆరోపణలు...
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతులు వామన్ రావు-నాగమణి జంట హత్యల కేసులో సంచలన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్ట్ నేపథ్యంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు పలు సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు,కోడలు హత్య కేసులో ఓ మాజీ మంత్రి పాత్ర కూడా ఉందన్నారు. హత్యలో హస్తం ఉన్న పుట్ట మధుకు ఆ మాజీ మంత్రి సాయం చేశాడని ఆరోపించారు. పుట్ట మధు దంపతులను సరైన రీతిలో విచారిస్తే ఇంకా చాలామంది పేర్లు బయటకొస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కిషన్ రావు సంచలన ఆరోపణలు...
నిజానికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరిన తర్వాత వామన్రావుకు వైద్యం అందలేదని కిషన్ రావు ఆరోపించారు. ఆయనకు మందులు ఇవ్వవద్దని ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి వైద్యులకు చెప్పాడని ఆరోపించారు. ఈ కేసులో ప్రభుత్వం గనుక న్యాయం చేయకపోతే తాను సీబీఐ విచారణ కోరుతానని తెలిపారు.
ఇదే విషయమై హైకోర్టు జడ్జికి లేఖ రాస్తానని... అవసరమైతే ఢిల్లీకి వెళ్లి సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తానని అన్నారు. జంట హత్యల కేసులో గ్రామ స్థాయి నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు చాలామంది పాత్ర ఉందని ఆరోపించారు. పుట్ట మధు దంపతులను సరిగా విచారించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం...
తన కొడుకు కోడలు హత్యపై సమగ్ర దర్యాప్తు కోరుతూ ఏప్రిల్ 16న కిషన్ రావు వరంగల్ ఐజీకి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదు మేరకే ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం. అటు తెలంగాణ ప్రభుత్వం ఈ జంట హత్యల కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని కోరుతూ హైకోర్టుకు లేఖ రాసింది.
కరీంనగర్లో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరింది. దీనిపై హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పుట్ట మధును రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానికంగా విచారిస్తున్నారు. అయితే విచారణ అత్యంత గోప్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భీమవరంలో అరెస్టయిన పుట్ట మధు..
వామన్ రావు దంపతుల హత్య కేసులో తనపై వచ్చిన ఆరోపణలను పుట్ట మధు గతంలోనే ఖండించారు. అయితే ఈ హత్యకు సంబంధించిన సుపారీ డబ్బులు రూ.2కోట్లు మధు నుంచే హంతకులకు చేరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న మధును దీనిపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గత వారం రోజులకు పైగా అజ్ఞాతంలో ఉన్న మధును పశ్చిమ గోదావరిలోని భీమవరంలో రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించిన సంగతి తెలిసిందే. మంథని నుంచి మహారాష్ట్ర వెళ్లిన మధు... అక్కడి నుంచి కర్ణాటక,ఛత్తీస్గఢ్ల మీదుగా ఆంధ్రాకు చేరినట్లు గుర్తించారు. ఎట్టకేలకు భీమవరంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని రామగుండం తరలించారు.
Recommended Video
పుట్ట మధుపై ఉన్న ఆరోపణలు...
మంథని మధుకర్ హత్య,శీలం రంగయ్య లాకప్ డెత్,వామన్ రావు దంపతుల హత్య కేసుతో పాటు పుట్ట మధుపై అక్రమాస్తుల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటలకు పుట్ట మధు సన్నిహితుడు అన్న పేరు ఉన్నది. ఈటల కొడుకుతో కలిసి ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహించారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈటలపై వేటు తర్వాత పుట్ట మధుపై చర్యలు వేగవంతమవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అధిష్ఠానంతో పుట్ట శైలజ సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ సీఎం అందుబాటులోకి రావట్లేదన్న ప్రచారం ఉంది. దీంతో పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న ప్రచారం జోరందుకుంది.