వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రేయసి భర్తను చంపేశాడు
హైదరాబాద్: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తన ప్రియురాలి భర్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజ్పురి జిల్లా కరంధీన్పూర్ గ్రామానికి చెందిన సంజయ్ పాశ్వాన్(30), అతని భార్య జగద్గిరిగుట్ట చెన్నారెడ్డినగర్లో నివాసముంటున్నారు.
జీడిమెట్లలో ఓ ప్రైవేటు పరిశ్రమలో సంజయ్ పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, ఇంటి పక్కనే ఉండే బీహార్కు చెందిన రాకేశ్ కుమార్(28)తో పాశ్వాన్ భార్యతో పరిచయం ఏర్పడింది. అతను చనువుగా ఉండటంతో అందరూ కలిసి కుత్బుల్లాపూర్ సమీపంలోని అయోధ్యనగర్కు మకాం మార్చారు.
ఒకే ఇంట్లో రాకేశ్కుమార్తో పాటు సంజయ్ దంపతులు వారి పిల్లలుంటున్నారు. ఈ క్రమంలో సంజయ్ భార్యతో రాకేశ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా, ఈ విషయం సంజయ్కు తెలియడంతో రాకేశ్ను మందలించి గత శుక్రవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో అతను తన వివాహేతర బంధానికి అడ్డు తగులుతున్నాడని సంజయ్ను హత మార్చాలని కుట్రపన్నాడు.
ఆదివారం సంజయ్ పాశ్వాన్ను హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలోని జగద్గిరిగుట్ట-షాపూర్నగర్ పైపులైన్ రహదారి సమీపంలోని చెట్ల పొదలల్లోకి తీసుకెళ్లి కత్తిలో పొడిచి హతమార్చాడు. వారం రోజులైనా భర్త ఇంటికి రాకపోవడంతో, అనుమానం వచ్చిన సంజయ్ భార్య రాకేశ్ను శనివారం నిలదీసింది.
తానే చంపేశాననిచెప్పడంతో ఆమె జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలాన్ని సిఐ చంద్రశేఖర్ సందర్శించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.