అనుమానం: భార్యను అడవిలో వదిలేశాడు, ఆమె ఏం చేసిందంటే?
మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆమెను అడవిలో వదిలేశాడు.
మంచిర్యాల: జిల్లాలోని కాసిపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆమెను అడవిలో వదిలేశాడు. గత ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేవాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసిపేట మండలం కుర్రెఘడ్ పునరావాసకాలనీకి చెందిన టేకం సోనెరావు, గంగుబాయి భార్యాభర్తలు. భార్యపై అనుమానం పెంచుకున్న సోనెరావు ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత తిరుమలాపూర్ అటవీ ప్రాంతంలో ఆమెను వదిలేసి వచ్చాడు.

ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడంతో మూడు రోజులుగా గంగుబాయి కనిపించడం లేదని ఆమె బంధువులు మంగళవారం రాత్రి దేవాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం పోలీసులు గ్రామస్తులను విచారించగా అనుమానంతో సోనెరావు తరచూ భార్యను కొడుతున్నట్లు తెలిపారు.
కాగా, పాత తిరుమలాపూర్ గ్రామస్తులు శివారు అటవీ ప్రాంతంలో గంగుబాయి అనే మహిళ కనిపించినట్లు సమాచారం అందించడంతో పోలీసులు తిరుమలాపూర్ వెళ్లారు. అక్కడి బంధువుల ఇంట్లో గంగుబాయి ఉన్నట్లు తెలుసుకుని ఆమెను తీసుకొచ్చారు.
భర్త అడవిలో విడిచిపెట్టడంతో గంగుబాయి ఎలాగోలా ఆదివారం రాత్రే తన బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకుంది. కాగా, భర్త దాడిలో గాయపడిన గంగుబాయిని పోలీసులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications