తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన అక్కా, తమ్ముడు
హైదరాబాద్: నగరంలోని షాహినాయత్గంజ్లో మంగళవారం ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చారు ఓ దుర్మార్గపు అక్కా తమ్ముడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆస్తి కోసం ఏడాది క్రితం సదరు అక్కా తమ్ముడు కలిసి కన్న తల్లిని హత్య చేశారు.
ఆ తర్వాత విషయం బయటికి రాకుండా ఆమె మృతదేహాన్ని తమ ఇంటిలోనే ఖననం చేశారు. ఇంటికొచ్చిన తండ్రి తల్లి ఎక్కడ అని ప్రశ్నించగా.. ముంబై, బెంగళూరులోని బంధువుల ఇంటికి వెళ్లిందని అబద్ధం చెప్పారు. నెలలు గడుస్తున్నా తిరిగి ఇంటికి రాకపోవడంతో మృతురాలి భర్త జమీల్ టాస్క్ పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అక్కా తమ్ముడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య తామే చేసినట్లు అంగీకరించారు. నిందితులిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన పలువురిని విస్మయానికి గురిచేసింది.

బస్సు ఢీకొని దంపతుల మృతి
నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం కన్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పాఠశాల బస్సు ఢీకొనడంతో బైక్పై వెళుతున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఘటనలో మహబూబ్నగర్ జిల్లా వనపర్తి డిగ్రీ కళాశాల సమీపంలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి బైకుపై వెళుతూ.. పామును తప్పించబోయి కిందపడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గోపాలపేట మండలం చీర్కపల్లి గ్రామంలో జరగబోయే ‘పల్లె వికాసం' కార్యక్రమానికి వెళ్తున్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేష్ ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడ్డారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications