విషాదం: హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ఐఐటీ-హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఐఐటీ బ్లాక్ లోని 107 గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.
ప్రస్తుతం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసుల నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా.
విద్యుత్ షాక్తో తల్లి, కుమార్తె మృతి
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారంలో పండగపూట విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో తల్లికుమార్తె మృతి చెందారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం రాత్రి ఇంటి వెనుక వ్యవసాయ మోటర్ ఆన్ చేసేందుకు సరిత.. తన ఏడాది కుమార్తెతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో విద్యుత్ తీగ ఆమె కాలికి తాకింది. విద్యుదాఘాతంతో సరిత, సాన్విత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిని వెతుకుతూ వెళ్లిన సమ్మయ్య కూడా షాక్కు గురయ్యాడు.
తీవ్ర గాయాలైన అతడిని చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్నారు. విద్యుదాఘాతానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు మృత్యువుతో పోరాడుతుండటంతో.. బొప్పారంలో పండగపూట విషాదఛాయలు అలముకున్నాయి.