అనుమానాస్పదం: చెన్నై లాడ్జీలో తెలుగు టెక్కీ ఆత్మహత్య
చెన్నై: నల్గొండ జిల్లాకు చెందిన ఏసీబీ కానిస్టేబుల్ యాదగిరి చిన్న కుమారుడు శ్యాంప్రసాద్(22) మంగళవారం రాత్రి చెన్నై అడయార్లోని ఓ లాడ్జిలో ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, బుధవారం అర్ధరాత్రి తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో హుటాహుటిన చెన్నైకి బయల్దేరి వెళ్లారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని పాలెం గ్రామానికి సంబంధించిన చౌగోని యాదయ్య ఏసీబీలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు శ్రీకాంత్ మూడేళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, రెండో కుమారుడు శ్యాంప్రసాద్(22) చెన్నైలోని ర్యాంకీ సిస్టమ్స్(ఎరోప్లేన్) కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు.
శ్యాంప్రసాద్ నలుగురు స్నేహితులతో కలిసి చెన్నైలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం అమెరికా నుంచి సోదరుడు శ్రీకాంత్ ఫోన్ చేయగా.. శ్యాంప్రసాద్ లిఫ్ట్ చేయలేదు. మళ్లీ ఫోన్ చేస్తానని ఎస్ఎంఎస్ చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మళ్లీ ఫోన్చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది.
అయితే, శ్యాంప్రసాద్.. తాను ఇంటికి వెళుతున్నానని అతడి స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని కుటుంబసభ్యులు తెలిపారు. లాడ్జీలో ఉరివేసుకోవడానికి ముందు ఓ స్నేహితుడికి తాను రూమ్కు వస్తున్నానని శ్యాంప్రసాద్ మేసేజ్ చేసినట్లు స్నేహితులు చెప్పారన్నారు. ఆ తర్వాత స్నేహితులు ఫోన్ చేసినా కలవకపోవడంతో వారు పట్టించుకోలేదని చెప్పారు.

ఆత్మహత్యపై అనుమానాలు
మృతుడి వద్ద ఫోన్ ఉన్నప్పటికీ సిమ్కార్డు లేకపోవడం ఆత్మహత్యపై అనుమానాలకు తావిస్తోంది. లాడ్జీలో ఉన్న సీసీ కెమెరాల్లో శ్యాం ప్రసాద్ ఒక్కడే బ్యాగ్ వేసుకుని లాడ్జిలోకి వచ్చి అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలున్నాయని చెన్నైకి వెళ్లిన అతడి బంధువులు చెప్పారు.
బుధవారం ఉదయం శ్యాంప్రసాద్ బయటకు రాకపోవడంతో సిబ్బంది డోర్ తెరిచారు. కాగా, అప్పటికే అతను ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలో సోదరుడితోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేందుకు వీసా సిద్ధమైన క్రమంలో ఈ ఘటన జరగడం శ్యాంప్రసాద్ కుటుంబసభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. శ్యాంప్రసాద్ మృతదేహాన్ని శుక్రవారం నల్గొండలోని శ్రీనగర్ కాలనీలోని సొంత నివాసానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు.












Click it and Unblock the Notifications