మరో విషాదం: పెళ్లైన 3రోజులకే భర్త హత్య, తట్టుకోలేక భార్య ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని మల్లేపల్లిలో గురువారం మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడో పెళ్లి చేసుకున్నాడనే కారణంగా మంగళవారం రాత్రి ఓ డాక్టర్ని బావమరిది గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం ఆ వ
హైదరాబాద్: నగరంలోని మల్లేపల్లిలో గురువారం మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడో పెళ్లి చేసుకున్నాడనే కారణంగా మంగళవారం రాత్రి ఓ డాక్టర్ని బావమరిది గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం ఆ వైద్యుని భార్య ఆత్మహత్యకు పాల్పడింది.
'నా భర్త నన్ను ఎంతో ప్రేమించాడు.. ఆయన లేని జీవితం నాకు అక్కర్లేదు. నా భర్త మృతదేహాన్ని ఖననం చేసిన చోటే నన్నూ ఖననం చేయండి' అంటూ లేఖ రాసి పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వివాహమైన మూడురోజులకే భర్త హత్యకు గురికావడంతో ఎంతో మానసిక వేదనను అనుభవించిన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్ మిస్రీగంజ్ పూల్బాగ్కు చెందిన అర్షియాబేగం(30) మల్లేపల్లికి చెందిన డాక్టర్ సయ్యద్ మిరాజుద్దీన్(45)ను మార్చి 19న వివాహం చేసుకున్నారు. అయితే, అతడికి ఇది మూడో పెళ్లి. తన బావ మళ్లీ వివాహం చేసుకోవడం ద్వారా అక్కకు అన్యాయం జరిగిందని మిరాజుద్దీన్ రెండో భార్య సోదరుడు అజీముద్దీన్ అతడిపై కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో మార్చి 21న రాత్రి మల్లేపల్లిలో ఉన్న 'మిరాజ్ కార్డియో క్లినిక్ అండ్ లైఫ్ కేర్ సెంటర్'కు వెళ్లిన అజీముద్దీన్.. మిరాజుద్దీన్ను గొంతు కోసి హతమార్చాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని అర్షియాబేగం గురువారం ఉదయం నమాజ్ చేసిన అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెండు ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.