తెలంగాణలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి
Gruha Jyoti: తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కీలకమైనది- గృహ జ్యోతి. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను సరఫరా చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. 200లు లేదా అంతకంటే తక్కువ యూనిట్ల విద్యుత్ను వినియోగించిన గృహావసర వినియోగదారులకు జీరో బిల్లు అందుతుంది ఈ గ్యారంటీ కింద.
గృహ జ్యోతి పథకాన్ని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ నోటిఫికేషన్ను జారీ చేశారు.

ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వారు.. తమ చిరునామాను తప్పనిసరిగా అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. తెలంగాణలో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డును అధికారులకు అందజేయకపోతే ఈ పథకం వర్తించదు.
తెలంగాణలో నివసిస్తూ ఆధార్ కార్డు లేనివారు వెంటనే తమ సమీపంలో ఉన్న సెంటర్లో తమ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారు ఆ స్లిప్పుతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద ఫొటో ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్ బుక్, పాన్ నంబర్లల్లో ఒకటి అధికారులకు అందజేయాలి.
పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పొందిన జాబ్ కార్డు, ఫొటో ఉన్న కిసాన్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, గెజిటెడ్ అధికారి లేదా తహశీల్దార్.. తమ అధికారిక లెటర్ హెడ్ మీద జారీ చేసిన లబ్డిదారుడి చిరునామా పత్రం వినియోగించవచ్చు. ఇతర ప్రభుత్వ శాఖలు జారీ చేసిన ఏదైనా ఒక డాక్యుమెంట్ను అడ్రస్ ప్రూఫ్గా అందజేయవచ్చు.
అడ్రస్ ప్రూఫ్ లేని వారు గృహ జ్యోతి పథకాన్ని అమలు చేసే నాటికి తమ పేర్లను ఆధార్లో ఎన్ రోల్ చేసుకోవాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ విజ్ఞప్తి చేశారు. ఈ పథకం ఎప్పటి నుంచి అమలవుతుందనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications