Weather Update: మే 16 వరకు రాష్ట్రంలో వర్షాలు..
ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరులుపులకుతోడుగా గాలి కూడా బలంగా వీయడంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో కరెంట్ కు అంతరాయం ఏర్పడింది. వర్షంతో చాలా చోట్ల వరి ధాన్యం తడిసింది. వరంగల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం సాయంత్ర వాన పడింది. ఆదివారం రాత్రి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో జల్లులు కురిశాయి.
కొత్తగూడలో అత్యధికంగా 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వరంగల్ జిల్లా మంగళవారిపేటలో 82 మిల్లీమీటర్లు, గొర్రకుంటలో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. భూపాలపల్లిలో 89 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా గిమ్మలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు.

రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, మరఠ్వాడా, ఇంటీరియర్ కర్నాటక, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో మే 16 వరకు వర్షాలు కురిసే అకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సాయంత్రం వర్షం, ఉదయం, మధ్యాహ్నం ఎండతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం వడ దెబ్బకు నలుగురు చనిపోయారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లికి చెందిన వెల్దండి తిరుపతయ్య, చెక్క సుగుణమ్మ, ముల కలపల్లికి చెందిన ఓనపాకల మీసాల భద్రయ్య అనే ముగ్గురు వడదెబ్బతో మృతి చెందారు.












Click it and Unblock the Notifications