నరేష్- పవిత్ర లోకేష్ వ్యవహారంలో కీలక మలుపు: షాకింగ్ విషయాలు వెలుగులోకి- హైకోర్టులో..!!
టాలీవుడ్ నటుడు నరేష్- ఆయన భార్య రమ్యా రఘుపతి వివాదం ఇవ్వాళ మరో మలుపు తీసుకుంది. రమ్య తనను వేధిస్తోందని, హత్య చేయడానికి ప్రయత్నిస్తోందంటూ నరేష్- హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు నరేష్, ఆయన భార్య రమ్యా రఘుపతి మధ్య వివాదం అనూహ్య మలుపు తిరిగింది. రమ్యకు వ్యతిరేకంగా నరేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తనను వేధిస్తోందని, హత్య చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రమ్య నుంచి తనకు విడాకులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లైన తొలి రోజుల నుంచే రమ్యా తనను వేధిస్తోందని, ఆమెతో కలిసి జీవించలేనని స్పష్టం చేశారు.
కేసీఆర్కు అన్ని పార్టీల్లో కోవర్టులు- ఈటెల రాజేందర్ సంచలనం..!!
విడాకుల కోసం..
నరేష్.. తన తోటి నటి పవిత్ర లోకేష్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతోన్న విషయం తెలిసిందే. రమ్యా రఘుపతికి విడాకులు ఇచ్చి.. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఈ మధ్యే నరేష్-పవిత్ర లోకేష్ ఓ వీడియో క్లిప్ ను విడుదల చేశారు. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడాన్ని రమ్యా రఘుపతి గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. నరేష్ కు విడాకులు ఇవ్వడానికి అంగీకరించట్లేదు. ఇది కాస్త ఇద్దరి మధ్యా చిలికి చిలికి గాలీవానగా మారింది.
హైకోర్టులో పిటీషన్..
దీనిపై నరేష్ తాజాగా హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రమ్యా రఘుపతి విపరీతంగా మద్యం సేవిస్తుంటారని నరేష్ ఆరోపించారు. తన స్నేహితుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లు, పార్టీల్లో తరచూ పాల్గొంటుంటుదని, మద్యం సేవించి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటుందని అన్నారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని నరేష్ పేర్కొన్నారు. తనకు ఉన్న ఆస్తులు, డబ్బు మీదే రమ్యకు వ్యామోహం అధికమని నరేష్ ఈ పిటీషన్ లో పొందుపరిచారు.
రూ.10 కోట్లు..
తనతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి 10 కోట్ల రూపాయలను రమ్యా రఘుపతి డిమాండ్ చేసినట్లు నరేష్ ఆరోపించారు. దీనికోసం కొంతమంది మధ్యవర్తులను కూడా తన వద్దకు పంపించిందని వివరించారు. తాను దీనికి అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఫలితంగా ఆమె తనను హత్య చేయడానికీ కుట్ర పన్నిందని, దీనికోసం రెక్కీ కూడా నిర్వహించిందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను హతమార్చడానికి పన్నిన కుట్రలో రోహిత్ షెట్టి అనే వ్యక్తి రమ్యకు సహకరిస్తోన్నారని తెలిసినట్లు చెప్పారు.
హత్యకు రెక్కీ..
మాజీ మంత్రి రఘువీరారెడ్డితోనూ ఫోన్ చేయించి తనను బెదిరించారని పిటిషన్లో వెల్లడించారు. తనను హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీలో ఓ పోలీస్ అధికారి కూడా రమ్యకు సహకరిస్తున్నారని నరేష్ ఆరోపించారు. తన ఫోన్ ను హ్యాక్ చేశారని, బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తన పేరు చెప్పి రమ్యా రఘుపతి చాలామంది వద్ద లక్షల రూపాయలను వసూలు చేసిందని, ఆమె నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరారు.