తెలంగాణ కాంగ్రెస్ కు నూతన సారధి ఖరారు, కానీ..!!
తెలంగాణ కాంగ్రెస్ కు నూతన అధ్యక్షులు రానున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ టీపీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారు. రేవంత్ మూడేళ్ల పదవీ కాలం పూర్తయింది. దీంతో, తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడిని కోరారు. దీంతో, ఈ రాత్రి ఢిల్లీలో తెలంగాణ ముఖ్య నేతలతో ఏఐసీసీ నేతలు భేటీ కానున్నారు. నూతన టీపీసీసీని ఖరారు చేయనున్నారు. ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి.
టీపీసీసీ నూతన సారధి
తెలంగాణ కాంగ్రెస్ నూతన సారధి ఖరారు కానున్నారు. టీపీసీసీ చీఫ్ గా నియమించిన తరువాత తన హయాంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటంతో పాటుగా..పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను జీరో చేసామని రేవంత్ చెప్పుకొచ్చారు. కొత్తగా టీపీసీసీ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని చెప్పారు. సామాజిక సమీకరణాలు - సమర్థత ఆధారంగా కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని వెల్లడించారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తారని అంతా ఊహించారు. కానీ లోక్ సభ ఎన్నికలు వెంటనే ఉండటంతో రేవంత్ రెడ్డినే అధిష్టానం కంటిన్యూ చేసింది.

రేవంత్ ఛాయిస్
దీంతో ఇప్పుడు మార్పు అనివార్యం కాగా... రేవంత్ రెడ్డి కూడా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, కొత్త పీసీసీ చీఫ్ నిర్ణయంపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు. బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గ నేతకు పీసీసీ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్ ఛాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
మొగ్గు అటు వైపే
గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండటంతో..రాహుల్ గాంధీ సైతం ఆయన మాట వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో..మహిళకు ఇవ్వటం ద్వారా రాజకీయంగానూ మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు పార్టీ జాతీయ స్థాయి పోస్టులుసైతం తెలంగాణ నేతలకు దక్కే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ, జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పోస్టులకోసం నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో..టీపీసీసీ చీఫ్ గా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications