తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: తెలంగాణలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది.
ఈ క్రమంలో బుధవారం నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, ఎడ్ సెట్, పీఈ సెట్ వాయిదా పడ్డాయి.
ఇప్పటికే కరోనా పరీక్షల నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీతోపాటు ఇతర జిల్లాల్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది కాంగ్రెస్ విజయమని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ అన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని కోర్టులో వెంకట్ పిల్ వేశారు. దీనిపై మంగళవారం వాదనలు జరిగాయి.
Recommended Video
ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 15,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9559 యాక్టివ్ కేసులున్నాయి. 5582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 253 మంది మరణించారు.