హైకోర్టుకు అల్లు అర్జున్.. చిరంజీవిని రావొద్దన్నారు!
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి(35) అనే మహిళ మృతిచెందగా ఆ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అల్లు అర్జున్ తరఫు లాయరు నిరంజన్ రెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని చాలా అత్యవసరంగా విచారించాలంటూ కోర్టుకు విన్నవించారు. అత్యవసర పిటిషన్ అయినప్పుడు ఉదయం 10.30 గంటలకే మెన్షన్ చేయాలికదా అని కోర్టు నిరంజన్ రెడ్డిని ప్రశ్నించింది.
మధ్యాహ్నం పిటిషన్ విచారించాలనడం సబబు కాదు
పిటిషన్ ను బుధవారమే మెన్షన్ చేశామని, క్వాష్ పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయస్థానం స్పందించి ఈ పిటిషన్ ను సోమవారం విచారిస్తామని చెప్పింది. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న దృష్ట్యా దీన్ని లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలంటూ పిటిషనర్ తరఫు లాయరు కోర్టును కోరారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారించండి అంటూ కోరడం సరైన చర్య కాదని ప్రభుత్వం తరఫు లాయరు కోర్టు దృష్టికి తెచ్చారు. లాయరు నిరంజన్ రెడ్డి మాత్రం సోమవారం వరకు ఈ కేసులో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. అయితే పోలీసుల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వాటిని కోర్టుకు తెలియపరుస్తామని ప్రభుత్వ తరఫు లాయరు కోర్టుకు తెలిపారు.

చిరంజీవిని రావొద్దన్న పోలీసులు
అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో స్టేషన్ దగ్గరకు అతని తండ్రి అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు, ఇతర ప్రముఖులంతా తరలివచ్చారు. లంచ్ మోషన్ పిటిషన్ 1.30 గంటలకు స్వీకరించాలనడంలో అర్థం లేదని కోర్టు వ్యాఖ్యానించడంతో ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కేసులో పోలీసులు బన్నీకి స్టేషన్ బెయిల్ ఇస్తారా? లేదంటే రిమాండ్ కు తరలిస్తారా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై సాయంత్రానికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్టేషన్ దగ్గరకు చిరంజీవి రానున్నారనే సమాచారం తెలుసుకున్న చిరంజీవిని పోలీసులు రావొద్దని కోరారు. అభిమానులు కూడా వస్తే తమపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, భద్రతా ఏర్పాట్లు కష్టమవుతుందని చెప్పడంతో ఆయన స్టేషన్ కు రావడం మానుకున్నారు.












Click it and Unblock the Notifications