తిరుపతికి కానుకలిస్తే నిలదీయరా?, గాలి లెక్కలొద్దు: టి నేతలపై షా తీవ్ర ఆగ్రహం
తెలంగాణ బీజేపీ నేతలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. నల్గొండలో ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాల గురించి రాష్ట్ర నేతలను ప్రశ్నించి, ఆయా విషయాల గురించి ఆరాతీసి, సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
చదవండి: మేధావులకు అమిత్ షా ఆసక్తికర ప్రశ్న
పలు విషయాలపై నేతలను ఆరా తీశారు. గాల్లో లెక్కలు కాదని, చేతల్లో చూపించాలని చురకలు అంటించారు. ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఓసారి తెలంగాణకు వస్తానని వారికి చెప్పారు. రోడ్ మ్యాప్ వేయాలని, కచ్చితంగా అమలు చేయాలని హితబోధ చేశారు.
సీఎం తిరుమల టూర్పై ఎందుకు మాట్లాడలేదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరుమల పర్యటన పైన పెదవి విప్పకపోవడాన్ని అమిత్ షా ప్రశ్నించారని తెలుస్తోంది. ప్రజా నిధులను తిరుపతికి ఇస్తుంటే మీరు ఎందుకు నిలదీయలేదని అడిగారు.
ముస్లీం రిజర్వేషన్లు, ప్రగతి భవన్..
ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ విషయంలో స్థానిక బిజెపి నేతలు సరిగా స్పందించలేదని అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ పైన ఎందుకు పోరాడలేదని నిలదీశారు. సరిగా పోరాడలేదని మండిపడ్డారు.
ఇంట్లో కూర్చుంటే గెలవలేం
కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై బీజేపీ నేతల పోరాటంపై అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై సరిగా పోరాడటం లేదన్నారు. ఇంట్లో కూర్చుంటే గెలవలేమని, ఎవరమూ నాయకులం కాలేదని క్లాస్ పీకారు.
అమిత్ షా ప్రశ్న ఆసక్తికరమే
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని అమిత్ షా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సరిగా పోరాడటం లేదని మండిపడ్డారని తెలుస్తోంది.
కాగా, తిరుపతికి ప్రజాధనాన్ని ఇవ్వడాన్ని కాంగ్రెస్ సహా దాదాపు అన్ని పార్టీలు విమర్శించాయి. అయితే బీజేపీ అధ్యక్షులు అమిత్ షా కూడా దీనిని ప్రశ్నించమని చెప్పడం గమనార్హం. బీజేపీ అంటే హిందుత్వ పార్టీగా ముద్ర ఉంది. అలాంటి పార్టీ అధ్యక్షులు తిరుపతికి కానుకలు ఇవ్వడాన్ని ప్రశ్నించమని చెప్పడం గమనార్హం.