తొందరపాటు చర్యలొద్దు! అల్లు అర్జున్ నివాసంపై దాడి ఘటనపై అరవింద్
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) నివాసంపై ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై అల్లు అర్జున్ తండ్రి, సినీ నిర్మాత అరవింద్ విచారం వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాలని, అదే మంచిదని వ్యాఖ్యానించారు.
'మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. దేనికీ రియాక్ట్ కాకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకు దిగినవారిని తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు' అని అరవింద్ తెలిపారు.

ఇలాంటి దాడుల ఘటనలకు ఎవరూ ప్రోత్సహించకూడదని అల్లు అరవింద్ అన్నారు. మీడియా వచ్చారు కదా అని.. ఈ ఘటనపై మేం స్పందించం. సంయమనం పాటించాల్సిన సమయం. అదే పాటిస్తున్నాం. తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దు అని అరవింద్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ రాళ్ల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారా? అని మీడియా ప్రశ్నించగా.. అల్లు అరవింద్ స్పందించకుండా వెళ్లిపోయారు.
రాళ్లు, టమాటలతో అల్లు అర్జున్ నివాసంపై దాడి
ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులు కొందరు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని.. వెంటనే రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు, టమాటాలు విసిరారు. ఇంట్లోకి నినాదాలు చేసుకుంటూ దూసుకెళ్లేందుకు యత్నించారు.
రాళ్లు తగలడంతో అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు, గార్డెన్లోని మొక్కలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నివాసం దగ్గర అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, దాడి ఘటన జరిగిన సమయంలో నటుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేరని సమాచారం. విషయం తెలుసుకున్న అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఈ ఘటనపై ఆరా తీశారు. జరిగిన రాళ్ల దాడిపై సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications