లాయర్లతో దురుసు: కోర్టు వద్ద ఏఎస్సై మోహన్ రెడ్డి కొడుకు, సోదరుడు వీరంగం
కరీంనగర్: న్యాయస్థానం ప్రాంగణంలో ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరులు గురువారం హల్చల్ సృష్టించారు. అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో ఈ రోజు మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యాడు. పెద్ద సంఖ్యలో అనుచరులతో మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యాడు.
దీనిపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లాయర్ల పట్ల మోహన్ రెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. మోహన్ రెడ్డి అనుచరులు తమపై దాడి చేశారని లాయర్లు ఆరోపించారు. మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేయొద్దని న్యాయవాదులు నిర్ణయించారు.
అక్రమ వడ్డీ వ్యాపారాలకు పాల్పడిన కేసులో న్యాయస్థానంలో వీరంగం సృష్టించిన వారిలో మోహన్ రెడ్డి కుమారుడు అక్షయ్ రెడ్డి, సోదరుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు మీడియా ప్రతినిధులు ఫోటోలు తీసిన సమయంలోను దాడికి యత్నించినట్లుగా తెలుస్తోంది.
ఆ తర్వాత న్యాయవాదులు అడ్డుకోవడంతో మోహన్ రెడ్డి సోదరుడు, కొడుకు గొడవకు వారితోనూ దిగారు. మండిపడిన న్యాయవాదులు దాడి ఘటనను కోర్టు దృష్టికి తీసుకువెళతామని, కేసులు పెడతామని హెచ్చరించారు. వారిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని, మోహన్ రెడ్డిని తిరిగి జైలుకు తరలించారు. మోహన్ రెడ్డి అనుచరులు తమ పైన దాడి చేశారని కరీంనగర్ కోర్టులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు.