kCR,BRS కోలుకోవడం కష్టమే: వేణుస్వామి
జ్యోతిష్యాన్ని నమ్మమనికానీ, నమ్మొద్దనికానీ తాము చెప్పడంలేదని ఆధ్యాత్మికతపై ప్రవచనాలు చెప్పేవారు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. జ్యోతిష్యం అనేది వ్యక్తిగతంగా కాకుండా అది ఒక సమూహానికి సంబంధించిందని, ఆ కోణంలోనే చూడాలని, భారం అంతా భగవంతుడిపై వేసి కష్టపడి పనిచేయాలని ఎన్నోసార్లు చెప్పారు. కానీ మనిషి బలహీనతను క్యాష్ చేసుకొని సొమ్ముచేసుకునే జ్యోతిష్యులు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు.
తాజాగా ఒక జ్యోతిష్య పండితుడు వేణుస్వామి గురించి మాట్లాడుకుందాం. ఆయన రాజకీయ రంగంతోపాటు సినీ రంగంలోని సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత జాతకాలు చెబుతూ పాపులర్ అయ్యారు. చివరకు ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయ్యారు. ఫలానా వేణుస్వామి ఏం చెప్పాడు? అంటే ఆసక్తి తిలకించేవారు కూడా ఉన్నారు. తాజాగా ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భవితవ్యానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన భారత రాష్ట్ర సమితి తిరిగి పుంజుకునే అవకాశాల్లేవన్నారు.

ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పార్టీ పేరు మార్చడంవల్లే జాతకం ప్రకారం ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. బీఆర్ఎస్ గా ఉంటే ఎప్పటికీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్లీ పేరు మార్చితే అదృష్టం మారే అవకాశం ఉందన్నారు. ఒకవేళ కేసీఆర్ పేరు మారిస్తే 2025 నుంచి పార్టీ గ్రాఫ్ పెరిగి పూర్వ వైభవానికి అవకాశం ఉందన్నారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కేసీఆర్ కోరిక మాత్రం నెరవేరదన్నారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ప్రాముఖ్యత ఉండదని, ఆదరణ లభించదన్నారు. తెలంగాణకు పరిమితమైతేనే ప్రజల ఆదరణ ఉంటుందని, పార్టీ పేరులో తెలంగాణ అనేది కచ్చితంగా ఉండాలన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో బీఆర్ఎస్ 39 గెలుచుకొని ప్రతిపక్షానికే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి 64 స్థానాలను గెలుచుకుంది.
కొసమెరుపు: కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని గతంలోనే ఢంకా బజాయించి మరీ ఈ వేణుస్వామి చెప్పారు.












Click it and Unblock the Notifications