అల్లు అర్జున్ ఇంటిపై దాడి రాజకీయ ప్రోద్బలం! డీజీపీని అలర్ట్ చేసిన సీఎం రేవంత్
సినీనటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ జితేంద్రకి ఫోన్ చేసి సీఎం రేవంత్ మాట్లాడారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో రాజకీయ ప్రోద్బలం ఉండే అవకాశం ఉందని డీజీపీని సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు.
మరోవైపు, అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులలో ఒకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో దిగిన ఫొటోను సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ విభాగం అందించింది. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీపడొద్దని సీఎం రేవంత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రముఖుల భద్రత విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని ఆదేశించారు.

వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సినీనటుడు అల్లు అర్జున్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు.
'శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. 'సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి' అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా, సంధ్య థియేటర్ ఘటనపై ఏసీపీ విష్ణు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
రాళ్లు, టమాటలతో అల్లు అర్జున్ నివాసంపై దాడి
ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులు కొందరు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని.. వెంటనే రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు, టమాటాలు విసిరారు. ఇంట్లోకి నినాదాలు చేసుకుంటూ దూసుకెళ్లేందుకు యత్నించారు.
రాళ్లు తగలడంతో అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు, గార్డెన్లోని మొక్కలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నివాసం దగ్గర అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, దాడి ఘటన జరిగిన సమయంలో నటుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేరని సమాచారం. విషయం తెలుసుకున్న అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఈ ఘటనపై ఆరా తీశారు. అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతుల కుమారుడు, కుమార్తెను ఆయన తన వెంట వారి ఇంటికి తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications