ఉద్యోగ, ఉపాధ్యాయులారా.. కేసీఆర్ పాలనను అంతం చెయ్యండి: బండి సంజయ్ పిలుపు
తెలంగాణ సీఎం కేసీఆర్ పైన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబలి, అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోతాయా అంటూ ప్రశ్నించిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేవలం అధికారం, డబ్బుతో ఎలక్షన్లలో గెలవాలని ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు బండి సంజయ్ ఆసక్తికర పిలుపునిచ్చారు.
ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వాలనే మార్చేసిన చరిత్ర ఉందని, కెసిఆర్ అరాచక పాలన ఎట్లుందో మీకు అందరికీ తెలుసని, మీరు పడిన గోసను గుర్తుచేసుకొని కెసిఆర్ పాలనను అంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మీ కోసం పోరాటం చేసిన బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీకు మూడు నెలలకు ఒకసారి జీతాలు వస్తాయని బదిలీలు, ప్రమోషన్లు రావని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ బిజెపి అభ్యర్థిగా డాక్టర్ పాల్వాయి హరీష్ రావు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ సిర్పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్ రాజ శ్యామల యాగం పేరుతో క్షుద్ర పూజలు చేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. 50 లక్షల మంది నిరుద్యోగులు, 40 లక్షల మంది రైతులు, లక్షలాది మంది విద్యార్థుల పక్షాన యుద్ధం చేసిన పార్టీ బిజెపి అని, కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడకుండా మీకు అండగా ఉన్నామని అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. జీతాలు ఇవ్వలేని వాడు మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పులు ఎలా తీరుస్తాడని, జీతాలు ఎలా ఇస్తాడని ప్రశ్నించారు బండి సంజయ్.
పొరపాటున మళ్లీ అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రం నాశనమవుతుందని, ఓడిపోతామని తెలిసే బిజెపికి గ్రాఫ్ తగ్గించే కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో కలిసి కెసిఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు, కాంగ్రెస్ కి పైసలు ఇచ్చి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో తొలి ఓటరు ఉన్న నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్ అని పేర్కొన్న బండి సంజయ్ బిజెపి తొలివిజయం కూడా ఇక్కడే అంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications