కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చెయ్: బండి సంజయ్ డిమాండ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమని గొప్పలు చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పూర్తిగా దివాలా తీయించారని బండి సంజయ్ మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ దుస్థితిలో ఉందో అర్థమవుతోంది: బండి సంజయ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మండిపడిన బండి సంజయ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇవ్వడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో జిల్లా చొప్పున వంతులవారీగా జీతాలు చెల్లిస్తూ ప్రతి నెల రెండవ వారం దాకా సాగదీస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. చివరకు 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు జనవరి నెల వేతనం ఇప్పటికీ చెల్లించలేదంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ దుస్థితిలో ఉందో అర్థమవుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోవటం దారుణం
ఇక ఇదే సమయంలో ఇక ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులతో ఏ కార్పొరేట్ ఆస్పత్రి కూడా వైద్యం చేయకపోవడంతో ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఉద్యోగులు జిపీఎఫ్ లో కూడబెట్టుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా పెండింగ్ పెడుతున్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు జిపిఎఫ్ లో కూడబెట్టుకున్న డబ్బులను తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహాల కోసం దాచుకుంటే అవి కూడా చెల్లించకపోవడం దురదృష్టకరమని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఎంప్లాయ్ మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా?
జిపిఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులను గత రెండేళ్లుగా ఎందుకు పెండింగ్లో పెట్టారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎంప్లాయ్ మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించిన బండి సంజయ్ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇచ్చి, ఆనందంగా ఇంటికి పంపుతామని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న కేసీఆర్ తీరును ఆయన ఎండగట్టారు.
Recommended Video
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్
సీఎం చెప్పినంత గొప్పగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రజా స్వామిక తెలంగాణా లక్ష్యంగా తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ తీరుపై పోరాటం చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.