కేసీఆర్ కొడుకు పాత్రను చూపినందుకే: బీజేపీ శ్రేణులకు జైలు నుంచే బండి సంజయ్ లేఖ
కరీంనగర్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు లేఖ విడుదల చేశారు. తనకు జైళ్లు కొత్త కాదని, టీఎస్సీపీఎస్సీ లీకేజీలో ప్రభుత్వ తప్పిదాలను ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తిచూపినందుకే తనను అరెస్ట్ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు.
కేసీఆర్ సర్కార్ను బొందపెట్టడమే తమ లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కొడుకును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే వరకు నిరుద్యోగులకు రూ. లక్ష పరిహారం ఇచ్చే వరకు పోరాడాలని కోరారు. తనకు కేసులు, అరెస్టులు, కొత్త కాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన బాధంతా నిరుద్యోగుల భవిష్యత్పైనేనని చెప్పారు.

30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో, వాళ్ల కుటుంబాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. నాడు ఇంటర్ విద్యార్థులను 27 మందిని బలితీసుకున్న ఈ ప్రభుత్వం.. ప్రస్తుతం 10 విద్యార్థుల జీవితాలతోనూ చెలగాటమాడుతోందని విమర్శించారు. ఇప్పటికే కేసీఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సహా సబ్బండి వర్గాలు అనేక కష్టాలను అనుభవిస్తున్నాయని.. వాళ్లందరికీ బీజేపీ ఆశా దీపమైందని తెలిపారు. వాళ్ల ఆశలను నెరవేర్చాలంటే పోరాటమే శరణ్యం అని లేఖలో సంజయ్ స్పష్టం చేశారు.
మరోవైపు, బొమ్మలరామారం పోలీసులు బండి సంజయ్ పట్ల అనుచితంగా వ్యవహరించారని తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ కు బండి సంజయ్ అడ్వకేట్ రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. బొమ్మలరామారం వెళ్లకుండా తనను ఆడుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications