బీజేపీలో విబేధాలపై స్పందించిన బండి సంజయ్; తెలంగాణాలోనూ లిక్కర్ స్కాం అంటూ సంచలనం!!
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాలపై, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఒక సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారం తప్ప బీజేపీ నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవని బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని వివాదం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్.
రాష్ట్రపతిని ఓడించే ప్రయత్నం చేసి రాష్ట్రపతిని అవమానించిన ప్రతిపక్షాలు ఇప్పుడు పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు గిరిజనమహిళ అని కూడా చూడకుండా అవమానించి, ఇప్పుడు ఈ రాజకీయాలు దేనికి అంటూ ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయం ప్రకారమే ఏ కార్యక్రమమైన జరుగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో పరిస్థితులపై స్పందించిన ఆయన తెలంగాణలో లిక్కర్ దందా జరిగిందని, దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నారని దశాబ్ధి ఉత్సవాలు చేయాలో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, కానీ దశాబ్ది ఉత్సవాలకు 105 కోట్ల రూపాయలు ఇచ్చారని బండి సంజయ్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను చర్చకు రాకుండా ఈ ఉత్సవాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ దందా జరిగిందని ఆరోపించిన ఆయన, ఢిల్లీ, పంజాబ్ లలో లిక్కర్ దందా చేసిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చెయ్యలేరా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గాంధీభవన్ లో తప్ప మరెక్కడా సంబరాలు చేసుకునే పరిస్థితి లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. గ్రానైట్ వ్యాపారులతో తనకు సంబంధం లేదని తాను ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. గ్రానైట్ తో తనకు సంబంధం లేదని గతంలో అమ్మవారి ముందు ప్రతిజ్ఞ చేశానని మళ్లీ చేయమన్నా చేస్తానంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
111 జీవో పై కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఎవరికి ఎన్ని ఎకరాలు ఉందో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కోరారు. కెసిఆర్ చేయించుకున్న సర్వే ప్రకారం 42 సీట్లు వస్తాయని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి బిజెపినే ప్రత్యామ్నాయమని పేర్కొన్న బండి సంజయ్ సర్వేల ప్రకారం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించడం బీజేపీ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. బీజేపీ దూకుడును తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని పైకి లేపుతుంది అని బండి సంజయ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications