కెసిఆర్ టార్గెట్, కాంగ్రెస్తో టిడిపి జత: రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య వెనుక!
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి.. కాంగ్రెస్ పార్టీతో ఉప్పు - నిప్పులా ఉంటోంది. అయితే, ఇటీవల తెలంగాణ టిడిపి యువనేత, కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
వివిధ అంశాల పైన కెసిఆర్ ప్రభుత్వ పాలన పైన విపక్షాలైన టిడిపి, కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాయి.
రైతుల ఆత్మహత్యలు పట్టించుకోవడం లేదని, అమలు కానీ హామీలు ఇచ్చారని, రోజుకో పథకం ప్రవేశ పెడుతూ వాటిని మాత్రం అమలు చేయడం లేదని, కెసిఆర్ మాటకారితనంతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రాజెక్టుల రీడిజైనింగ్ సరికాదని.. ఇలా వివిధ అంశాలపై కెసిఆర్ తీరుపై విపక్షాలు సహా అందరు భగ్గుమంటున్నారు.
మరీ ముఖ్యంగా రైతుల ఆత్మహత్య, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్... టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఒకే వేదిక పైకి వచ్చి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని కల్పించాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలోను రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యలు, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీతో ఒకే వేదిక మీదకు వచ్చి పోరాడాల్సిన స్థితి కల్పించారని రేవంత్ చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే చంద్రబాబుకు అరికాలి మంట! అలాంటి చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాడేందుకు అనుమతి ఇస్తారా చూడాలి. అయితే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యూహాత్మకమా అనే చర్చ సాగుతోంది.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక...!
ఓటుకు నోటు అంశంలో రేవంత్ రెడ్డిదిగా భావిస్తున్న వీడియోలో రేవంత్ రెడ్డి 'రెడ్డి' సామాజిక వర్గానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, కెసిఆర్ ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని కాంగ్రెస్, టిడిపిలకు చెందిన పలువురు నేతలు ఆరోపిస్తున్నాయి.
కెసిఆర్ టార్గెట్ చేసుకున్నట్లుగా చెబుతోంది.. రెడ్డి సామాజిక వర్గాన్ని. ఓటుకు నోటు సమయంలో రేవంత్ ఆ వ్యాఖ్యలు, కెసిఆర్ టార్గెట్ పెట్టుకోవడం... దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఆ సామాజిక వర్గం ప్రధానంగా ఉన్న నేపథ్యంలో.. వారి మద్దతు కోసం రేవంత్ వ్యూహాత్మకంగా ఆ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ సాగుతోంది.