12 ఏళ్లకు పైనున్న వయస్సు పిల్లలకూ కోవిడ్ వ్యాక్సిన్: రూ.1,500 కోట్లు అడ్వాన్స్ పేమెంట్
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన మరో వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్పిక్.. వంటి టీకాలకు తోడుగా దీన్ని కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగించనుంది కేంద్ర ప్రభుత్వం. 12 నుంచి 18 సంవత్సరాల్లోపు వయస్సున్న వారి కోసం ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ వయస్సు ఉన్న వారికి ప్రస్తుతం వ్యాక్సిన్ లేదు.
యుక్త వయస్కుల కోసం కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగంలో ఉంది గానీ అది 15 నుంచి 18 సంవత్సరాల్లోపు వారికే. ఇప్పుడు తాజాగా 12-18 వయస్సు ఉన్న వారికోసం కొత్త వ్యాక్సిన్ త్వరలో వినియోగంలోకి రానుంది. అదే కోర్బెవ్యాక్స్. హైదరాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్ ఈ.. అమెరికన్ వ్యాక్సిన్ డెవలప్మెంట్స్ సంస్థలతో కలిసి దీన్ని అభివృద్ధి చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ను వినియోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ సంస్థ యాజమాన్యం ఇదివరకే డ్రగ్ కంట్రోలర్ జనరల్కు దరఖాస్తులను దాఖలు చేసింది.
ఈ దరఖాస్తులపై డీసీజీఐకి చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) తాజాగా ఆమోదం తెలిపింది. కోర్బెవ్యాక్స్ వినియోగానికి అనుమతి ఇవ్వొచ్చంటూ డీసీజీఐకి సిఫారసు చేసింది. ఎస్ఈసీ అనుమతి లభించడంతో- డీసీజీఐ ఆమోదం లాంఛనప్రాయమే అవుతుంది. డీసీజీఐ అనుమతి పొందిన వెంటనే కోర్బెవ్యాక్స్ అందుబాటులోకి వస్తుంది. 12 నుంచి 18 సంవత్సరాల వయస్సున్న వారికి కోర్బెవ్యాక్స్ వ్యాక్సిన్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్పై దీని ఎఫీషియన్సీ 89.7 శాతంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.
30 కోట్ల డోసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇదివరకే బయోలాజికల్ ఈ సంస్థ యాజమాన్యానికి 1,500 కోట్ల రూపాయలను అడ్వాన్స్ రూపంలో చెల్లించింది కూడా. తొలి దశలో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ను ఈ కంపెనీ సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.బయోలాజికల్ ఈ, అమెరికాలోని టెక్సాస్ చిల్ర్డెన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవల్పమెంట్, హ్యూస్టన్లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సంయుక్తంగా కోర్బెవ్యాక్స్ను అభివృద్ధి చేశాయి.