'గిల్లి.. జో కొట్టడం' అంటే ఇదే... తెలుసుకోండి తెలుగు ప్రజలారా??
దేశానికి రాష్ట్రపతిగా తెలుగువ్యక్తి ఉండాలని ప్రజలంతా ఆశగా ఎదురు చూశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఎంపిక చేస్తారని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆశించారు. కానీ ఏనాడూ ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు న్యాయం చేయడానికి మనసొప్పని నరేంద్రమోడీ, అమిత్ షా వెంకయ్యను ఎంపిక చేస్తారని ఎదురు చూడటం కూడా అత్యాశే అవుతుంది. రాష్ట్రపతి పదవికి అర్హత కలిగిన తెలుగువారు ఎందరో ఉన్నారు. వెంకయ్యనాయుడు కాకపోయినా ఎవరో ఒకరినైనా ఎంపిక చేస్తే బాగుంటుందని ఆశించారు.
జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు..
కానీ మన తెలుగువారు కూడా ఉన్నత పదవిలో ఉంటారుకదా అనే ఉద్దేశంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలను అడియాశలు చేయడంలో ఎప్పుడూ ముందుండే నరేంద్రమోడీ, అమిత్ షా మరోసారి అలాగే వ్యవహరించారు. ద్రౌపది ముర్మును ఎంపిక చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతాపార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారుంటే ఎంతో సంతోషించేవాళ్లమనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇంత సానుకూల వాతావరణం ఉండటం ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు ప్రయత్నించలేదు?
ఆయన కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైన వ్యక్తి. రాజ్యసభ సభ్యత్వం రానంతవరకు అసలు జీవీఎల్ అంటే ఎవరో తెలియదు. తెలుగు వ్యక్తిని ఎంపిక చేయాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, కిషన్రెడ్డి, బండి సంజయ్, విద్యాసాగర్రావు, ఇంద్రసేనారెడ్డిలాంటివారు ఏమైనా కృషిచేశారా? అంటే అదీ లేదు. ఎందుకు చేయలేదంటే.. నేరుగా మోడీని, అమిత్ షాను కలిసి వెంకయ్యనాయుడును కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో అంత హోదాకు తగ్గ వ్యక్తిని ఎంపిక చేయాలంటూ అడిగే సాహసం చేయలేకపోయారు.
ప్రజలను మభ్యపరిచే ప్రకటనలు చేయవద్దు!!
జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు 'గిల్లి జో కొట్టడం' అంటే ఇలాగే ఉంటుందని బీజేపీ ద్వితీయశ్రేణి నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. వెంకయ్యనాయుడు కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పదవికి ఎంపిక కాగలిగినవారు ఎంతోమంది ఉన్నారు. ఆ దిశగా ఎందుకు కృషిచేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ వాటికి వారిదగ్గర ఎటువంటి సమాధానం లేదు. ప్రజలను మభ్యపరిచే ప్రకటనలు చేయవద్దని, వాస్తవాలు చెప్పాలని కోరుతున్నారు. దేశ అత్యున్నత పదవిని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే సంస్కృతిని భారతదేశంలో ఇప్పుడే చూస్తున్నామంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.