చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు: తుల ఉమ కంటతడి, సూసైడ్ చేసుకుంటానంటూ దేశ్పాండే
హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే, అధికార పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చివరలో తమ అభ్యర్థులను మార్చాయి. దీంతో అప్పటికే సిద్ధమైన అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు నిరసన వ్యక్తం చేశారు. మరికొందరు కంటతడి పెట్టారు. ఇంకొందరు ఏకంగా పార్టీని వీడి మరో పార్టీలో చేరారు. మరికొందరు సైలెంట్గా ఉండిపోయారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో వారు స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. సంగారెడ్డి బీజేపీ టికెట్ పక్కా అని చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. మాట మార్చి మరొకరికి బీ-ఫామ్ ఎలా ఇస్తారని బీజేపీ నాయకుడు రాజేశ్వేర్రావు ధేశ్పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పేరుతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఇచ్చిన లిస్టులో తన పేరు ఉంటే చివరి నిమిషంలో బీ-ఫామ్ వేరే వాళ్ల చేతిలో ఎలా పెడతారంటూ కన్నీటి పర్యంతమయ్యారు దేశ్పాండే. ఆయన అనుచరులు బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

మరోవైపు చివరి నిమిషంలో వేములవాడ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం మార్చింది. శుక్రవారం ఉదయం బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన కొద్దిసేపటికే బీజేపీ అభ్యర్థిగా వికాస్ రావు అదే నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉమ కంటతడి పెట్టుకున్నారు. బీసీ మహిళలంటే పార్టీలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దొరల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడినందుకే తనకు టికెట్ నిరాకరించారని ఆమె ఆరోపించారు.
అభ్యర్థిని మార్చినట్టు కనీసం సమాచారం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. బీసీ ముఖ్యమంత్రి చేస్తానన్న బీజేపీ ఇలా చేయడం సరికాదన్నారు మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించిన బీజేపీ.. తనకు ఇలా అన్యాయం చేసిందని వాపోయారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని బరిలో ఉంటానని తెలిపారు. అయితే, బీజేపీ ముఖ్య నేతలు అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications