పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ .. 6న ఇందూరుకు అమిత్ షా : లక్ష్మణ్
హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఉత్తరాదిలో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. సీట్ల లెక్కలు, విజయవకాశాలపై కూడా ధీమాగా ఉంది. అయితే దక్షిణాదిలో పార్టీ బలోపేతం అనే అంశం ఆ పార్టీ అగ్రనేతలను కలవరానికి గురిచేస్తోంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆశించిన మేర పుంజుకోకపోవడంతో .. ఏం చేయాలనే అంశంపై మదనపడుతుంది.
25 నుంచి అభ్యర్థుల ఎంపికపై చర్చ
ఈ నెల 25 నుంచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హై కమాండ్ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. 25న భువనగిరి క్లస్టర్ సమావేశానికి కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరవుతారు. అక్కడ జరిగే సమావేశంలో పార్టీ పటిష్టత కోసం అవలంభించాల్సిన విధానాలపై చర్చ జరుగనుంది. 28న హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మార్చి 2న అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా వ్యవహరించి పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు లక్ష్మణ్.
పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటన
ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పార్లమెంట్ స్థానాల్లో క్లస్టర్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆయా పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి ఉన్న పరిస్థితి, అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతోన్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభీష్టం మేరకు అభ్యర్థులను ఎంపికచేయాలని భావిస్తోన్నారు.

3న ఓరుగల్లుకు నిర్మలా
వచ్చేనెల 3న వరంగల్ లో బీజేపీ క్లస్టర్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారని తెలుస్తోంది.
6న ఇందూరుకు బీజేపీ చీఫ్
వచ్చే నెల 6న నిజామాబాద్ కు బీజేపీ చీఫ్ అమిత్ షా వస్తున్నారు. అక్కడ పార్టీ పరిస్థితి, అభ్యర్థి ఎంపికపై విసృతంగా చర్చిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహించడంతో .. టీఆర్ఎస్ పార్టీపై పోటీ చేసి గెలుపొందాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ను పోటీ చేయించాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications