తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్ధి ఆయనేనా : ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేసింది : మారుతున్న సమీకరణాలు..!!
తెలంగాణలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో జెండా ఎగురవేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు సామాజిక సమీకరణాల్లో ఎక్కడ ఏది అవసరమో అది అమలు చేసే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఫాలో అవుతున్నారు. ఇప్పటి దాకా కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో ఎక్కువగా ఉండే బీసీ వర్గానికి చెందిన నేతలకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని అందరూ భావించారు. అయితే అమిత్ షా కొత్త ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు కొత్త అభ్యర్దిని తెర మీదకు తెచ్చారు.
తెలంగాణతో సుదీర్ఘ అనుబంధం..స్థానికంగా ఎమ్మెల్యేగా..ఎంపీగా..కేంద్ర మంత్రిగా.. గవర్నర్ గా పని చేసిన అనుభవం..హార్డ్ కోర్ బీజేపీ నేత..కేసీఆర్ తో సత్సంబంధాలు ఉన్న నాయకుడు కావటంతో ఆయన పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తర తెలంగాణలో పట్టు ఉన్న ఆ నేతను బీజేపీ ఇక తెలంగాణలో ముందుంచి అధికారం టార్గెట్ గా రాజకీయ ఎత్తుగడలు వేయనుంది. అయితే, షా అమలు చేస్తున్న వ్యూహాలు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.
నరసింహన్ గు తొలిగించి తొలి దెబ్బ...
తెలంగాణలో ఉన్న పరిస్థితులు తమకు అనుకూలంగా మలచుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకోవాలని అమిత్ షా పట్టుదలతో ఉన్నారు. ప్రతీ నెల ఒక కేంద్ర మంత్రి తెలంగాణలో పర్యటించాల ని నిర్ధేశించారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడటం..టీడీపీ ఉనికి కోల్పోవటం..ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందనే అంచనాతో బీజేపి పావులు కదుపుతోంది. అయితే, ఇప్పుడున్న నేతల్లో ప్రజాకర్షణ ఉన్న నేతలు లేరనేది స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు చెబుతున్న మాట. దీంతో..ఇప్పుడు గ్రేటర్ పరిధిలో రాజాసింగ్ ను పార్టీ ప్రోత్సహిస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ఒక్కరే బీజేపీ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక, గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను తప్పించటం ద్వారా కేసీఆర్ లక్ష్యంగా పావులు కదపటం మొదలు అయిందనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల వరకు ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్సంబంధాలు కొనసాగించారు. ఆ తరువాత ఎన్నికల ప్రచారం మొదలు ఇద్దరి మధ్య ఆరోపణలు మొదలయ్యాయి. ఇక, దక్షిణాదిన కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ..ఇప్పుడు తెలంగాణలో ఫోకస్ చేస్తోంది. దీని కోసం కొత్త సమీకరణాలను తెర మీదకు తెస్తోంది.
విద్యాసాగర్ రావుపైనే ఫోకస్..
మహారాష్ట్ర గవర్నర్ గా పదవి విరమణ చేయబోతున్న చెన్నమనేని విద్యాసాగరరావు కు తెలంగాణలో పార్టీ నాయకత్వ బాధ్యత అప్పగిస్తారని విశ్వసనీయ సమాచారం. విద్యాసాగరరావు ఐదేళ్ల క్రితం గవర్నర్ పదవి ఇచ్చారు. ఆయన పదవిని పొడిగించలేదు. ఆయనకు పార్టీలో కీలకమైన బాద్యత అప్పగించవచ్చని భావిస్తున్నారు.గతంలో విద్యాసాగరరావు పార్టీ ఉమ్మడి ఎపి అద్యక్షుడుగా ఉన్నారు. ఉత్తర తెలంగాణలో పలుకుబడి కలిగిన నేతగా గుర్తింపు పొందారు. రెండుసార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అయితే కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బ తీయాలంటే తెలంగాణ లో అధికంగా ఉండే బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే, తెలంగాణ ఉద్యమ సమయంలో..తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించిన నేతల్లో బీజేపీ నుండి విద్యా సాగర్ రావుకు గుర్తింపు ఉంది. కేసీఆర్ సైతం విద్యా సాగర్ రావుకు పౌర సన్మానం చేయటం.. ప్రాజెక్టుల కార్యక్రమాలకు ఆహ్వానించారు. అయితే, హార్డ్ కోర్ బీజేపీ నేత అయిన విద్యా సాగర్ రావును తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యత అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా ఇప్పటికే ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరటం..మరి కొంత మంది సిద్దంగా ఉండటంతో..వీరందరికీ కలుపు కు పోవాలంటే ముందుగా తెలంగాణలో పార్టీ వాయిస్ బలంగా వినిపించే ప్రస్తుత నేతలకు అదనంగా మరో ముఖ్య నేతను రంగంలోకి దించాలని నిర్ణయించారు.
ఆర్ఎస్ఎస్ రికమండేషన్ మేరకు...
బీజేపీ కి మూల సిద్దాంతకర్త అయిన ఆర్ఎస్ఎస్ తెలంగాణలో విద్యా సాగర్ రావును ప్రమోట్ చేయాలని బీజేపీ అగ్ర నేతలకు సూచించినట్లుగా సమాచారం. కేసీఆర్ కు ఆర్దికంగా.. సామాజికంగా అండగా నిలుస్తున్న ప్రధాన సామాజిక వర్గాన్ని ఆయన నుండి దూరం చేయాలంటే అదే వర్గానికి చెందిన జాతీయ స్థాయిలో వారికి అండగా నిలవగలిగిన వ్యక్తిగా తెలంగాణలో విద్యా సాగర్ రావును ప్రమోట్ చేయాలనేది వారి ఆలోచన. ముందుగా ఆ వర్గ నేతలను కేసీఆర్ నుండి తమ వైపుకు తిప్పుకోవటం ద్వారా ముఖ్యమంత్రిని రానున్న రోజుల్లో బలహీన పరచవచ్చనేది బీజేపీ వ్యూహం. ఇక..ఇప్పటికే రెడ్డి వర్గ నేతలు ఎక్కువగా బీజేపీ లో చేరారు. బీసీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి..దత్తాత్రేయకు గవర్నర్ పదవి కట్టబెట్టారు. సామాజిక సమీకరణాల్లో పక్కగా ఉండే అమిత్ షా..ముందుగా కేసీఆర్ ను సొంత సామాజిక వర్గానికి దూరం చేయటానికి తెర మీదకు విద్యా సాగర్ రావు పేరును తీసుకొస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని కీలక సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.