ఈ విజయం టీఆర్ఎస్కే అంకితం... ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై సురభి వాణీ దేవి రియాక్షన్...
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపుపై టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీ దేవి సంతోషం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం టీఆర్ఎస్కే అంకితమని చెప్పారు. తానెవరో తెలియకపోయినా వారి ఇంటి ఆడపడచులా భావించి.. తన విజయం కోసం పాటుపడిన పార్టీ నేతలు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. తనకున్న అనుభవంతో విద్యారంగంలో,ఉద్యోగ రంగంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు.
బీజేపీ నేత రామచంద్రరావు సురభి వాణీ దేవికి శుభాకాంక్షలు తెలిపారు. ఓటమిపాలైనప్పటికీ నైతిక విజయం మాత్రం బీజేపీదేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిందని ఆరోపించారు.ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్లకు డబ్బులు పంపిణీ చేశారని... ఉద్యోగ సంఘాల నేతలను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. డబ్బు పంపిణీ,బెదిరింపులు,ప్రలోభాలతోనే టీఆర్ఎస్ ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఉద్యోగులకు పీఆర్సీ,ఫిట్మెంట్ ప్రకటించి టీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో మూడేళ్లుగా అమలుచేయని ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లపై సరిగ్గా ఎన్నికల వేళ ప్రకటన చేయడమేంటని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకుని వారిని బెదిరింపులకు గురిచేశారని... టీఆర్ఎస్కు ఓటేయకపోతే పీఆర్సీ,ఫిట్మెంట్,ప్రమోషన్లు ఉండవని బెదిరించారని ఆరోపించారు.
సాధారణ ఎన్నికలను మించి ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం జరిగిందని రామచంద్రరావు ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్య,మధ్యతరగతి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం కలగానే మిగిలిపోతుందన్నారు. దాదాపు రూ.200కోట్లు టీఆర్ఎస్ ఖర్చు పెట్టిందన్నారు. ఇంత డబ్బును సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టినా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల వేళ సామాజికవర్గాల మధ్య కూడా చిచ్చు పెట్టారని ఆరోపించారు.
టీఆర్ఎస్ పార్టీకి ఫేస్ వాల్యూ లేకనే పీవీ నర్సింహారావు కుమార్తెను పోటీలో పెట్టారని అన్నారు. ఈ విజయం టీఆర్ఎస్ విజయం కాదని,పీవీ కుమార్తె విజయం గానే చూడాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తం 3,56,000 ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ కేవలం 8వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచిందన్నారు. రానున్న రోజుల్లో మరింత కసిగా పనిచేస్తామని చెప్పారు. అటు వరంగల్-ఖమ్మం-నల్గొండ,ఇటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ రెండు చోట్ల కాంగ్రెస్ గల్లంతయిందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఫలితాలు నిరూపించాయన్నారు. 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్పై పలు ఆరోపణలు చేశారు. డబ్బు పంపిణీ,అక్రమాలు,అధికార దుర్వినియోగంతోనే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందన్నారు.