తెలంగాణలో మరో ఉప ఎన్నిక - ఢిల్లీ కేంద్రంగా బీజేపీ మాస్టర్ ప్లాన్..!!
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా. బీజేపీ ముఖ్య నేతల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మునుగోడులో ఏరి కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. కానీ, ఫలితం కంటే వచ్చిన ఓట్లు.. టీఆర్ఎస్ కు ఇచ్చిన పోటీని బీజేపీ ముఖ్య నేతలు పరిగణలోకి తీసుకుంటున్నారు. దక్షిణాదిలో వచ్చే ఏడాది కర్ణాటక..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ కేడర్ లో ఉత్సాహం పెంచాలంటే రాజకీయంగా వారిని యాక్టివ్ చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఓడినా..వచ్చిన ఓట్లతో హ్యాపీ
అసలు పట్టు లేని నల్గొండ జిల్లా మునుగోడు లో బీజేపీకి 86,697 ఓట్లు వచ్చాయి. ఇదే మునుగోడులో 2018 ఎన్నికల్లో బీజేపీకి 12,725 మాత్రమే వచ్చాయి. కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ పొత్తు..కాంగ్రెస్ చీల్చిన ఓట్లు తమ ఓటమికి కారణంగా బీజేపీ విశ్లేషిస్తోంది. టీఆర్ఎస్ మంత్రులు..ఎమ్మెల్యేలు మోహరించినా 10 వేలకు మెజార్టీ పరిమితం చేసామని కమలం నేతలు చెబుతున్నారు. అయితే, తమ అసలు టార్గెట్ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడులో ప్రతికూల ఫలితం వచ్చినా.. టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు మరో ఉప ఎన్నికకు సిద్దం కావాలని బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. ఈ సారి హైదరాబాద్ నగరం కేంద్రంగా ఈ ఉప ఎన్నిక జరిగేలా ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

మరో ఉప ఎన్నికకు పావులు..?
అయితే, మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లటం..అందునా మునుగోడు ఫలితం తరువాత మరో బైపోల్ కు సిద్దం కావటం పైన పార్టీలో ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతోంది. హైదరాబాద్ లో బీజేపీకి పట్టు ఉంది. అక్కడ ఎంఐఎం - టీఆర్ఎస్ తో ఢీ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం రెండు ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మనుగోడులో గెలిచి ఉంటే మరో ఉప ఎన్నిక అవసరం లేదని, కానీ మునుగోడులో గెలిచి ఓడామని..ఇప్పుడు కేడర్ లో నిరుత్సాహం రాకుండా ఉండాలంటే మరో ఉప ఎన్నికకు సిద్దం అవ్వటమే సరైన వ్యూహంగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. కానీ, ప్రజల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయనే ఆలోచన పార్టీ నేతలను వెంటాడుతోంది. దుబ్బాక..హుజూర్ బాద్ తరహాలో మునుగోడులో విజయం సాధించలేకపోయినా.. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించామని కాషాయం నేతలు చెబుతున్నారు.
టీఆర్ఎస్ కు ధీటుగా ఎదిగేలా
అదే సమయంలో కాంగ్రెస్ కు కంచుకోటలో ఆ పార్టీకి డిపాజిట్ రాలేదని..ఇక తెలంగాణలో టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ మధ్యనే పొలిటికల్ వార్ కొనసాగుతుందనేది కాషాయం పార్టీ నేతల వాదన. మరో ఉప ఎన్నికకే వెళ్లి విజయం సాధిస్తే..మునుగోడు పరాజయం నైరాశ్యం పార్టీలో అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీలో కనిపించదనేది పార్టీ నేతల అంచనా. కానీ, మరో ఉప ఎన్నికకు వెళ్లటం ఈ పరిస్థితుల్లో దుస్సాహసం అవుతుందనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న వేళ..పార్టీ నేతలకు ఎటువంటి దిశా నిర్దేశం చేస్తారు.. తెలంగాణ భవిష్యత్ కార్యాచరణ పైన బీజేపీ అధినాయకత్వం ఏ వ్యూహాలు అమలు చేస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications