BRS గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు?
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి చెందిన దుబ్బాక శాసన సభ్యుడు రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు రాసిన లేఖ.. దుమారం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇదివరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత- సుకేష్ చంద్రశేఖర్ మధ్య జరిగినట్లుగా అనుమానిస్తోన్న వాట్సప్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే ఆయన ఈ లేఖ రాశారు.
బీఆర్ఎస్ నాయకుడు అరుణ్ పిళ్లైకి మనీ లాండరింగ్ కేసులో జ్యుడీషియరీ విచారణను ఎదుర్కొంటోన్న సుకేష్ చంద్రశేఖర్ 15 కోట్ల రూపాయలను బదలాయించారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకే ఈ నగదు బదలాయింపు చోటు చేసుకుందని ఈ లేఖలో పేర్కొన్నారు. 6060 రిజిస్ట్రేషన్ నంబర్ గల కారు తెలంగాణ భవన్కు వెళ్లినట్లు చెప్పారు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని- మనీ లాండరింగ్లో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని రఘునందన్ రావు- కేంద్ర ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఓ రాజకీయ పార్టీగా ఉంటూ బీఆర్ఎస్- మనీ లాండరింగ్కు పాల్పడిందని విమర్శించారు. కుంభకోణానికి పాల్పడటం ద్వారా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలంటూ రఘునందన్ రావు.. సీఈసీని కోరారు. ఈ నగదు బదలాయింపు మనీ లాండరింగ్తో సంబంధం ఉన్నట్టేనని భావించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టడానికి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సంబంధిత కేంద్రీయ దర్యాప్తు ఏజెన్సీకి ఈ కేసును బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications